పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్లపైనా? ఇదేనా రైతు రాజ్యం: హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్
పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్లపైనా, విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితికి రావడం ఇదేనా రైతు ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. రైతులకు విత్తనాలు అందించడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
హిందూపురం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ. రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే వైసీపీ రైతులకు సక్రమంగా వేరుశనగ విత్తనాలను కూడా సరఫరా చేయలేకపోయిందని విమర్శించారు.
పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్లపైనా, విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితికి రావడం ఇదేనా రైతు ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. రైతులకు విత్తనాలు అందించడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికి వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పొలం పనుల్లో ఉండాల్సిన రైతులు విత్తనాలు, ఎరువులు కోసం అర్ధరాత్రి వరకు విత్తన కౌంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఐదేళ్ల టీడీపీ పాలనలో రైతులకు ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పుకొచ్చారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే నాణ్యమైన విత్తనం, ఎరువులు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు విత్తనం, ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ కోతలు అధికమయ్యాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ కోతలు ఉన్నాయంటూ బాలకృష్ణ ఆరోపించారు.