Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం.. ఎమ్మెల్సీ రిజల్టే హింట్ : హీరో నారా రోహిత్ వ్యాఖ్యలు

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సినీ నటుడు నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టినట్లే.. రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు తెలుగుదేశానికి పట్టం కడతారని రోహిత్ జోస్యం చెప్పారు

hero nara rohit sensational comments on ap elections 2024
Author
First Published Mar 25, 2023, 2:45 PM IST

సినీనటుడు నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టినట్లే.. రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు తెలుగుదేశానికి పట్టం కడతారని రోహిత్ జోస్యం చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలని రోహిత్ పిలుపునిచ్చారు. ఇదిలావుండగా టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రలోభాలకు పాల్పడితే 50 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేసేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటేనే .. అసంతృప్తి ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చని అంగర రామ్మోహన్ వ్యాఖ్యానించారు. ఓటు వేయమని చంద్రబాబు ఎవరినీ అడగలేదని.. వారే స్వచ్ఛందంగానే వేశారని ఆయన అన్నారు. ఒక్కరోజు మద్యం అమ్మకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి చేరారని అంగర రామ్మోహన్ పేర్కొన్నారు. 

కాగా.. ఇకపై వైసీపీ విషయంలో మరింత అప్రమత్తంగా వుండాలని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వచ్చే టీడీపీ ప్రభుత్వంలో పైరవీలు వుండవని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని.. నలుగురు ఎమ్మెల్యేలు తమకు ఓటేసి స్క్రిప్ట్ తిరగరాశారని చంద్రబాబు పేర్కొన్నారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీయే కొనుగోలు చేసిందని ఆయన చురకలంటించారు. పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగిరిందని.. తాడేపల్లిలో టీవీలు పగిలిపోతున్నాయని చంద్రబాబు దుయ్యబట్టారు. అమరావతిని జగన్ భ్రష్టు పట్టించారని.. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశారని ఆయన ఎద్దేవా చేశారు.  

ALso REad: ఇకపై వైసీపీ ఇంకా ఇబ్బంది పెడుతుంది.. జాగ్రత్త : శ్రేణులకు చంద్రబాబు హెచ్చరిక

ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మూడు టీడీపీ ఖాతాలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్ధులు ఉత్తరాంధ్రలో వేపాడ చిరంజీవి రావు, పశ్చిమ రాయలసీమలో భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమలో కంచర్ల శ్రీకాంత్‌లు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలతో వైసీపీకి షాక్‌కు గురైన సంగతి తెలిసిందే. దీని నుంచి తేరుకోకముందే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ విజయం సాధించడంతో అధికార పార్టీలో కలకలం రేగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios