తిరుమల కొండలపై హెలికాప్టర్ల చక్కర్లు.. తీవ్ర కలకలం..
తిరుమల కొండలపై హెలికాప్టర్లపై చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది.
తిరుమల కొండలపై హెలికాప్టర్లపై చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. నో ఫ్లై జోన్ అయిన తిరుమల కొండల మీదుగా మూడు హెలికాప్టర్లు వెళ్లాయి. శ్రీవారి ఆలయం సమీపం నుంచే హెలికాప్టర్లు వెళ్లినట్టుగా తెలుస్తోంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరకామణి భవనం, బాలజీనగర్ ఉపరితలంపై నుంచి హెలికాప్టర్లు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో భక్తులు ఒక్కసారిగా విస్మయం చెందారు. ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు హెలికాప్టర్ల గురించిన వివరాలు ఆరా తీస్తున్నారు.
అయితే ఈ హెలికాప్టర్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందినవిగా సమాచారం అందుతోంది. కడప నుంచి చెన్నైకి వెళ్తుండగా హెలికాప్టర్లు తిరుమల మీదుగా వెళ్లినట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.