ఇవాళ, రేపు ఏపీలో భారీ నుండి అతిభారీ వర్షాలు...: విశాఖ వాతావరణకేంద్రం హెచ్చరిక
ఈ రెండురోజులు(సోమ, మంగళవారం) ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని చోట్ల భారీ నుండి అతిబారీ వర్షాలు కూడా కురవవచ్చని హెచ్చరించారు.
విశాఖపట్నం: మరో రెండురోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని... కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. మరో తెలుగురాష్ట్రం తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇవాళ(సోమవారం) సాయంకాలానికి ఉత్తర బంగాళాఖాతంలో మధ్య బంగాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతం మీద 4.5 కిలోమీటర్ల వరకూ తుఫాను ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండురోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం లో ఉరుములతో కూడిన గాలివానలు కూడా కురవవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశా తీరాన సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి ఉత్తర కోస్తాంధ్ర మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒడిశా దిశగా పోరాదని హెచ్చరించారు.
ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని అన్ని జలాకళను సంతరించుకుంటున్నాయి. ఇక నదులు, వాగులు, వంకలు, చెరువులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే జనజీవనానికి మరింత ఆటంకం కలిగే అవకాశం వుంది. లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహాల సమీపంలో జీవించే ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. అధికారులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా చూడాలని సూచించారు.