రానున్న 4-5గంటల్లో భారీ వర్షాలు... ఆ జిల్లాలకు పొంచివున్న ప్రమాదం
రానున్న 4-5 గంటల్లో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది.
అమరావతి : ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావారణ శాఖ మరో హెచ్చరిక జారీచేసింది. రానున్న 4-5 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ మేరకు విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యింది.
read more కేసిఆర్ కోరిన వెంటనే... ఆ సాయానికి ముందుకువచ్చిన జగన్
మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారనుందని... దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్ష సూచనతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముంపుకు గురై ప్రాంతాల్లో ప్రజలకు అంటు వ్యాధులు ప్రబలకుండా ముందోస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.