ఏపీ ,తెలంగాణలో ఉరుములు,మెరుపులతో వానలే..వానలు

Synopsis
ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరికతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణ భారత రాష్ట్రాల్లో వాతావరణం గురువారం ఒక్కసారిగా మారనుంది. వర్షాలు తేలికపాటిగా మొదలై కొన్నిచోట్ల భారీగా కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాత్రి వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.తెలంగాణలో ఈశాన్య ప్రాంతాల్లో ఉదయం నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకూ వర్షాలు కొనసాగుతాయి. సాయంత్రం తర్వాత ఉత్తర, మధ్య తెలంగాణలో మళ్లీ జల్లులు పడే అవకాశముంది. ఆకాశం మెఘావృతంగా ఉండే అవకాశం ఉంది కానీ కొన్ని చోట్ల ఎండ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.
రాయలసీమలో కూడా ఉదయం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత వర్షపాతం మరింత పెరిగి రాత్రి 9 గంటల వరకూ కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 వరకూ వర్షాలు కురుస్తాయని శాటిలైట్ అంచనాలు సూచిస్తున్నాయి. కోస్తాంధ్రలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులు పడే అవకాశాన్ని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలిచ్చారు.
గంటకు 50 కిలోమీటర్ల వేగంతో...
గాలి వేగం విషయానికొస్తే, వర్షం పడే సమయంలో గరిష్ఠంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 20 కిలోమీటర్లు కాగా, ఏపీలో ఇది 16 కిలోమీటర్లు, తెలంగాణలో 11 కిలోమీటర్లుగా నమోదైంది.ఉష్ణోగ్రతలు చూస్తే, ఏపీలో సగటున 31 డిగ్రీల సెల్సియస్ ఉండగా, రాయలసీమలో ఇది 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి.
తేమ పరిమాణం తెలంగాణలో 31 శాతంగా ఉండగా, ఏపీలో ఇది 70 శాతంగా ఉంది. అర్థరాత్రి సమయానికి ఈ తేమ శాతం తెలంగాణలో 60కు పైగా ఉండనుందని, ఏపీలో ఇది 89 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు వర్షాన్ని చిన్నచూపు చూడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.