తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్..!
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శని, ఆది వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, గోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగామ, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతోకూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక, ఇప్పటికే గురు, శుక్ర వారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్లలో ఈరోజు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నగరంలో ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. మార్చి 20 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.