ఆదివారం రాత్రి హరిరామజోగయ్య అరెస్ట్, దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు...
కాపు రిజర్వేషన్ల కోసం నేటినుంచి దీక్ష ప్రారంభించనున్న మాజీమంత్రి హరిరామ జోగయ్యను పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయన దీక్ష చేయకుండా ఆస్పత్రికి తరలించారు.
భీమవరం : కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కాపు రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం నుంచి తలపెట్టిన నిరవధిక నిరాహారదీక్షను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా ఆదివారం రాత్రి హరిరామజోగయ్యను అంబులెన్స్ లోకి ఎక్కించి… ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం నుంచి దీక్ష చేసేందుకు.. ఆదివారం ఉదయంనుంచి ఆయన ఇంటి దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లే రోడ్ల మీద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అటువైపుగా ఎవరూ రావడం, పోవడం చేయకుండా రాకపోకలను నియంత్రించారు. ఆ తరువాత డీఎస్పీ మనోహరాచారి నేతృత్వంలో కాకినాడ, బందరు అడిషనల్ ఎస్పీలు శ్రీనివాస్, ఎన్ వీ రామాంజనేయులు.. హరిరామజోగయ్యతో దీక్ష విషయంలో మాట్లాడారు. అయితే, ఆయన దీక్ష విరమించుకోవడానికి ఒప్పుకోలేదు. ఉన్నతాధికారులతో మాట్లాడాలని సూచించారు. రిజర్వేషన్లపై జీవో విడుదల చేసేలా ప్రయత్నించాలని పోలీసులకి తెలిపారు. ఈ సమయంలో హరిరామజోగయ్య నివాసంలోకి మీడియాను అనుమతించలేదు. చర్చలు విఫలం కావడంతో ఆ తర్వాత 400 మంది పోలీసుల భద్రత మధ్య ఆదివారం 10:40 గంటలకు హరిరామజోగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన రావడానికి నిరాకరించడంతో ఆయన కూర్చున్న కుర్చీతోపాటే అలాగే.. అంబులెన్స్ లోకి ఎక్కించి.. ఆస్పత్రికి తరలించారు.
కాపులకు రిజర్వేషన్ల కోసం రేపటి నుంచి నిరవధిక నిరహార దీక్ష.. హరిరామజోగయ్య
తనను అదుపులోకి తీసుకునే ముందు హరిరామ జోగయ్య ఓ వీడియోని విడుదల చేశారు. ‘జనవరి రెండవ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి దీక్ష ప్రారంభిస్తానని అన్నాను. కానీ, పోలీసులు చేస్తున్న ఈ పనుల కారణంగా ఈ క్షణం నుంచే దీక్షను ప్రారంభిస్తున్నాను. నాకు ఏదైనా జరిగితే పోలీస్ అధికారులు, సీఎం జగన్ లే కారణం’ అని ఆ వీడియోలో ఆయన చెప్పుకొచ్చారు.