కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి హరిరామ జోగయ్య డెడ్లైన్.. లేకపోతే నిరహార దీక్షకు దిగుతానని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి ఆ సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వెనకబడినవారికి కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్ను హరిరామ జోగయ్య కోరారు
ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి ఆ సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వెనకబడినవారికి కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్ను హరిరామ జోగయ్య కోరారు. రిజర్వేషన్ల అనేది తమ హక్కు అని అన్నారు. రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం ప్రకారంగా.. అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని డెడ్ లైన్ విధించారు. రిజర్వేషన్లను సంబంధించి ఉత్తర్వులు ఇవ్వకపోతే జనవని 2వ తేదీ నుంచి తాను నిరవధిక నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ప్రభుత్వం ఇవ్వకపోయినా.. తాను చచ్చైనా సరే సాధించుకుంటానని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
ఇక, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు ఆర్టికల్ 342A (3) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవచ్చని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ ఇటీవల తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కాపు సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర జాబితాలో ఉన్న కాపులకు రిజర్వేషన్ల కల్పనలో తమ పాత్ర లేదని తెలిపింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు .. ఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్రం వెల్లడించింది. 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపింది.