ఓవైపు కరోనా... మరోవైపు ఎండలు..: ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన
ఏప్రిల్ 1వ తేదీ నుండి 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు వుంటాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
అమరావతి: ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కేవలం ఒంటిపూట మాత్రమే పనిచేస్తాయని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు వుంటాయని... ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు.. తరువాత మధ్యాహ్న భోజనం వుంటుందన్నారు.
''పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలి. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాం'' అన్నారు మంత్రి సురేష్.
read more కొత్తగా 368 మందికి పాజిటివ్.. గుంటూరులో తీవ్రత: ఏపీలో 8,93,734కి చేరిన కేసులు
ఇక రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. రేపటి(మంగళవారం) నుంచి ఇంటినుండి బయటకు వచ్చేముందు ప్రతిఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మాస్కులు ధరించకుండా బయటకు వస్తే గ్రామాల్లో అయితే రూ.500, పట్టణాలలో అయితే రూ.1000 జరిమానా విధించనున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులకు జరిమానా పుస్తకాలు అందాయి.