మాస్క్ పెట్టుకోలేదని... తుళ్లూరు సీఐకి ఫైన్ వేసిన ఎస్పీ (వీడియో)
కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు.
గుంటూరు: దేశంలో కరోనా మళ్లీ విజృభిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్క్ వాడటం తప్పనిసరి చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. గుంటూరు అర్బన్ పరిధిలో మాస్కు ధరించని వారిపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆ క్రమంతో ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జికూడలి, ఎంటీబీ కూడలిలో స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు.
ఈ సమయంలో లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు. దీంతో వెంటనే సీఐని ఆపి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలి చెబుతున్న మీరే ఎందుకు మాస్క్ ధరించలేదని ప్రశ్నించారు. హడావిడిలో మర్చిపోయానని సీఐ తెలిపారు. ఏదేమైనా మాస్క్ ధరించకపోవడం కరోనా నిబంధనలను ఉల్లంఘించడమే కాబట్టి జరిమానా విధించి స్వయంగా మాస్కు తొడిగారు.
వీడియో
కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మాస్కు ధరించని కారణంగా సీఐకి అపరాధ రుసుం(ఫైన్) విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎస్పీ స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి పెట్టించారు. అలాగే వాహనదారులను ఆపి, మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించిన వారినే అనుమతించాలంటూ సమీపంలోని దుకాణదారులకు సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు.