గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి మంచి వార్త
గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చిన్న పిల్లల గుండె శస్త్ర చికిత్సలు ప్రారంభమయ్యాయి. మొదటి అపరేషన్ విజయవంతం.
గుంటూరు గవర్నమెంటు జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్) అనగానే ఎలుకలు గుర్తుకు రావచ్చు.
2015 ఆగస్టు లో నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్న ఒక శిశువు ఎలుకలు కొరకడంతోచనిపోయి, ఆసుపత్రి బాగా అపకీర్తి పాలయింది. ఈసంఘటన జాతీయ వార్త అయిపోయింది. అమ్మో, ప్రభుత్వాసుపత్రులా అని అంతా భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇపుడు ఇదే ఎలుకల ఆసుపత్రి నుంచి ఒక మంచి వార్త వెలువడింది. ప్రభుత్వ ఆసుపత్రులు బాగపడే అవకాశాలున్నాయి, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా పనిచేయగలవని ఇదే గుంటూరు జిజిహెచ్ రుజువు చేసింది.
గుంటూరు జనరల్ ఆసుపత్రిలో నిన్న చిన్నారి గుండెఆపరేషనొకటి విజయవంతమయింది.
ఆసుపత్రిలో చిన్న పిలల గుండె శస్త్ర చికిత్సలను బుధవారం నాడు ప్రారంభించి ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ప్రకాశం జిల్లాకు చెందిన నాలుగేళ్ల పాప ఎం బెన్నీసాల్మన్కు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. ఇది మొదటి ఆపరేషన్ . ఆపరేషన్ విజయవంతమైంది. చీరాల మండలం పందిళ్లపల్లికి చెందిన గోపి, ఏసుమణి దంపతుల పెద్దకుమారుడు బెన్నీసాల్మన్. ఆయాసంతో బాధపడుతున్న సాల్మన్ ను పిల్లల వైద్య నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించి రెండు రంద్రాలు ఉన్నట్లు గమనించారు.
ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం 9 గంటలకు ఆపరేషన్ ప్రారంభమయింది. మూడు గంటల వ్యవధిలో విజయవంతంగా ముగిసింది. డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలోని సహృదయ ట్రస్టు సహకారంతో శస్త్ర చికిత్స నిర్వహించామని జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్.రాజు నాయుడు తర్వాత ప్రకటించారు.
ఇకపై ఇలాంటి ఆపరేషన్లు కొనసాగిస్తామని దీనికోసం ఒక ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశామని చెబుతూ ప్రయివేటు వైద్యశాలల్లో రూ.2 లక్షల వరకు ఖర్చయ్చే ఆపరేషన్ను జిజిహెచ్లో ఎన్టిఆర్ వైద్యసేవ ద్వారా ఉచితంగా చేశామని వెల్లడించారు.
ఆపరేషన్ బృందంలో చిన్నపిల్లల హృద్రోగ నిపుణులు డాక్టర్ డివి రమణ, డిప్యూటి సూపరింటెండెంట్ డాక్టర్ యశోధర, డాక్టర్ వరప్రసాద్, వైద్యనిపుణులు డాక్టర్ వై.ఉషారాణి, డాక్టర్ పి.శ్రీనివాసులు, డాక్టర్ సుష్మ గాయత్రి, డాక్టర్ కె.సుధాకర్ ఉన్నారు.
గుంటూరు రాజధాని హోదా ఉన్న నగరమయింది. అందువల్ల ఈ ఆసుప్రతి మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం సహజం. అయితే, ఇలాంటి వసతులును అని జిల్లా కేంద్ర అసుపత్రులలో కల్పించాల్సిన అవపరం ఉంది. కార్పొరేట్ ఆసుపత్రులకు అరోగ్య బీమా కింద ఇచ్చే డబ్బును ఈ ఆసుపత్రులకే చెల్లించవచ్చు. ప్రభుత్వరంగ వైద్యాన్ని నిర్లక్ష్యంచేయడం మానుకోవాలి. వసతులు కల్పిస్తే కార్పొరేట్ ఆసుపత్రులందించే ‘క్వాలిటీ’ సేవలన్నీ ప్రభుత్వాసుపత్రులలో అందుబాటులోకి వస్తాయి.
ఆరోగ్యశ్రీ ప్రవేశపెడుతున్నపుడు ఈ అంశం కూడా చర్చనీయాంశమయింది. గుంటూరు ఆపరేషన్ అందరి కళ్లు తెరిపించాలి.