జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు 

ప్రజలకు అండగా నిలబడి వారి బాగోగులు చూసుకోవాల్సిన ఓ ప్రజాప్రతినిది వావివరసలు మరిచి మృగంలా వ్యవహరిస్తున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వరసకు చెల్లెలయ్యే ఓ మహిళను దాచేపల్లి జడ్పీటీసి ప్రకాష్ రెడ్డి లైంగిక వాంచ తీర్చమంటూ వేధిస్తున్నాడు. అయితే అతడిని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో సదరు మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బైటపడింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ విషయానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా దాచెపల్లి జడ్పీటిసి గా వైఎస్సార్ సిపి పార్టీకి చెందిన ములగుండ్ల ప్రకాష్ రెడ్డి పనిచేస్తున్నాడు. అయితే ఇతడు తనను లైంగిక వాంచ తీర్చమని వేధిస్తున్నాడని ముత్యాలపాడు కు చెందిన జ్యోతి అనే మహిళ ఆరోపిస్తోంది. తన భర్త చనిపోవడంతో ఒంటరిగా వుంటున్న తనను వరసకు అన్న అయ్యే ప్రకాష్ రెడ్డి వేధిస్తున్నాడని ఈమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

ఇతడి కోరిక తీర్చడానికి తాను ఒప్పుకోకపోవడంతో తన భర్తకు సంభందించిన ఆస్తి పంపకాల్లో తలదూర్చి ఇబ్బందిపెడుతున్నాడని జ్యోతి తెలిపింది. రెవెన్యూ సిబ్బందిని భయపెట్టి తన భూమికి సంబంధించిన పాస్ బుక్ లు రాకుండా అడ్డుపడుతున్నాడని ఈమె తెలిపింది. ఈ వ్యవహారంపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కూడా ప్రకాష్ రెడ్డి తరపునే మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్న జ్యోతి తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరింది.