దక్షిణ భారతదేశంలోనే అతి కీలకమైన జంక్షన్ గుంతకల్. ఈ నియోజకవర్గంలో అధికార వైసీపీ నుంచి వై వెంకట్రామిరెడ్డి, టీడీపీ నుంచి జితేంద్ర గౌడ్‌ పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారనేది మరి కాసేపట్లో తేలనుంది.   

గుంతకల్ ఈ పేరు చెప్పగానే.. అతిపెద్ద రైల్వే జంక్షన్, కసాపురం ఆంజనేయ స్వామి ఆలయం, బళ్లారి గనులు గుర్తొస్తాయి. దక్షిణ భారతదేశంలోనే అతి కీలకమైన జంక్షన్ గుంతకల్. గుంతకల్ రైల్వే డివిజన్‌కు హెడ్ క్వార్టర్స్. కర్ణాటక సరిహద్దుకు అత్యంత చేరువలో వుండటంతో ఈ నియోజకవర్గంలో మిక్స్‌డ్ కల్చర్ వుంటుంది. అలాగే రైల్వే డివిజన్ కావడంతో దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అప్పటి వరకు గుత్తిగా వున్న ఈ నియోజకవర్గాన్ని గుంతకల్‌గా మార్చారు. గుంతకల్, తాడిపత్రి మండలాల్లోని 9 గ్రామాలు, పామిడి మండలం ఈ నియోజకవర్గంలో చేరాయి. పూర్వపు గుత్తి నియోజకవర్గంలో 11 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, సీపీఐ ఒకసారి గెలిచాయి. 

గుంతకల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. మూడు సార్లు , మూడు పార్టీలకు ఛాన్స్ :

గుంతకల్లు నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,52,372 మంది. గుంతకల్, గుత్తి, పామిడి మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. ఆర్యవైశ్య, గౌడ, వాల్మీకి, బోయ, కురుబ, రెడ్డి సామాజికవర్గాలు ఈ నియోజవర్గంలో బలంగా వున్నాయి. గుంతకల్లు నియోజకవర్గం ఆవిర్భవించాక జరిగిన మూడు ఎన్నికల్లో మూడు పార్టీలు గెలిచాయి. తొలుత 2009లో కాంగ్రెస్ నుంచి మధుసూదన్ గుప్తా, 2014లో టీడీపీ నుంచి జితేంద్ర గౌడ్, 2019లో వైసీపీ నుంచి వై వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. వెంకట్రామిరెడ్డి సోదరులు సాయిప్రసాద్ రెడ్డి ఆదోనీలో, మరో సోదరుడు వై బాలనాగిరెడ్డి మంత్రాలయంలోనూ గెలుపొందారు. అలా ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి , ఒకే పార్టీ తరపున అసెంబ్లీలో అడుగుపెట్టిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 

గుంతకల్ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ, వైసీపీ హోరాహోరీ :

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి వై వెంకట్రామిరెడ్డికి 1,06,922 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి జితేంద్ర గౌడ్‌కు 58,390 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 48,532 ఓట్ల తేడాతో విజయం సాధించింది. 2024 ఎన్నికల విషయానికి వస్తే.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని జగన్ పట్టుదలతో వున్నారు. మరోసారి వెంకట్రామిరెడ్డికి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను తొలుత గుంతకల్ నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు చూశారు. అయితే స్థానిక నాయకత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడంతో చంద్రబాబు మనసు మార్చుకున్నారు. చివరికి గత ఎన్నికల్లో ఓటమిపాలైన జితేంద్ర గౌడ్‌కు టికెట్ కేటాయించారు. ఇప్పుడు వీరిలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠభరితంగా మారింది. మరికాసేపట్లో ఈ ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి.