Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాాకుళం తీరంవైపు దూసుకొస్తున్నగులాబ్ తుఫాను... ఏపీలో నేడు అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ఆదివారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం వుందని... దీని ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

gulab cyclone effect... today very heavy rains in andhra pradesh
Author
Amaravati, First Published Sep 26, 2021, 9:18 AM IST

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ఆంధ్ర ప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి తూర్పుగా 350కి.మీ,  గోపాలపూర్ కు 310కి.మీ దూరంలో తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండంగా ఉన్నపుడు గంటకు 14కి.మీ వేగంతో తీరం వైపు కదిలిన తుఫాను తుఫానుగా మారిన తర్వాత వేగం తగ్గి గంటకు 7కి.మీ వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. 

అయితే ఈ గులాబ్ తుఫాను వేగం పుంజుకుని నేటి(ఆదివారం) మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పశ్చిమంగా పయనిస్తున్నందున శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా తీరం దాటే అవకాశాలున్నాయని... పరిస్థితుల్లో మరింత మార్పు వస్తే సోంపేటలోని బారువ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

read more  గులాబ్ తుఫాను ఎఫెక్ట్... నేడు, రేపు తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు

ఈ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, తెలంగాణ, దక్షిణ ఒడిషాలో కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమయ్యింది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు... మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని విపత్తుల శాఖ కమీషనర్ కె.కన్నబాబు తెలిపారు.  

''ఆదివారం మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర  తీరం వెంబడి గంటకు 75 - 95 కీమీ వేగంతో బలమైన ఈదురగాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్ళరాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.  రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి'' అని కన్నబాబు హెచ్చరించారు. 

ఇప్పటికే గులాబ్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీ చేశారు. ఈ తుపాన్‌ ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.తుపాను ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios