వైసిపిలో వర్గపోరు నిజమే..ఇప్పటికే మూల్యం చెల్లించుకున్నాం..: మాజీ ఎమ్మెల్యే సంచలనం
ఉండి నియోజకవర్గంలో వైసిపి ఓటమికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కారణమని మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి హవా నడిచినా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీ చతికిల పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కారణమంటూ మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమి తర్వాత కూడా ఈ నియోజకవర్గ పార్టీలోనూ, నాయకుల్లోనూ ఎలాంటి మార్పు రాలేదన్నారు.
ఇప్పటికయినా వైసిపి నాయకులంతా ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం వుందని ఆయన సూచించారు. ఈ గ్రూప్ రాజకీయాలు ఇలాగే కొనసాగినా తమలాంటి నాయకులకు ఏమీ కాదని... కార్యకర్తలే నష్టపోతారని కార్యకర్తలను ఉద్దేశించి సర్రాజు వ్యాఖ్యానించారు.
READ MORE కాంగ్రెస్ పార్టీలో చేరుతా: అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్
ఉండి నియోజకవర్గంలో ఇప్పటివరకు వైసిపి జెండా ఎగరలేదు. 2014, 2019లో కూడా టిడిపి అభ్యర్ధే ఇక్కడ విజయం సాధించారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అఖండ విజయాన్ని అందుకున్నా ఉండిలో మాత్రం టిడిపి అభ్యర్థి మంతెన రామరాజు గెలిచారు. వైసిపి తరపున పోటీ చేసిన పీవీఎల్ నర్సింహరాజు ఓటమిపాలయ్యారు.