Asianet News TeluguAsianet News Telugu

నాణ్యమైన బియ్యం లబ్దిదారుల ఇంటికే:ఏపీ ప్రభుత్వం ప్రయోగం

నాణ్యమైన బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు అందించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ మాసంలో శ్రీకాకుళం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 

Grade A rice to be supplied in PDS: AP Govt
Author
Amaravathi, First Published Aug 28, 2019, 4:41 PM IST

అమరావతి: ఆహార భద్రత కార్యక్రమంలో భాగంగా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే నాణ్యమైన బియ్యాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో శ్రీకాకుళం జిల్లాలో రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకొన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

స్వర్ణ బియ్యానికి సమానమైన నాణ్యమైన బియ్యాన్ని రేషన్ కార్డులను అందించాలని ఏపీ సర్కార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కచ్చితమైన తూకంతో కూడిన  ప్యాకెట్ల రూపంలో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా కార్డు దారులకు ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు.

సెప్టెంబర్ మొదటి వారంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు 15 వేల టన్ను బియ్యం అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బుధవారం నాడు ఏపీ మంత్రి కొడాలి నాని ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. 

 రాష్ట్రంలో పౌరసరఫరాల సంస్థ ద్వారా కోటి 40 లక్షల మంది రేషన్ కార్డుదారులకు సుమారు 11వేల కోట్ల రూ.లు విలువైన బియ్యం కిలో రూపాయికే పంపిణీ చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డుదారుల్లో 92లక్షల మంది కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండగా మిగతా 55 లక్షల మంది కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో నాణ్యమైన బియ్యం అందించనున్నందున పాలిథిన్ బ్యాగుల స్థానంలో  పర్యావరణ హితమైన బ్యాగులతో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

ఈ మేరకు నెలకు 2 కోట్ల బ్యాగులు సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు ఒక సంస్థకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్రామ,వార్డు వాలంటీర్ల ద్వారా బియ్యం ఇతర సరుకులు ఇంటింటా పంపిణీ చేపట్టినప్పటికీ ప్రస్తుతం ఉన్న రేషన్ డీలర్లు ఎవరినీ తీయబోమని మంత్రి నాని స్పష్టం చేశారు.

గ్రామ వాలంటీర్లు రేషన్ బియ్యాన్ని వారి పరిధిలోని 50ఇళ్ళలో ఇంటింటికీ వెళ్ళి కార్డుదారులకు అందించేందుకు వీలుగా వారికి రవాణా ఖర్చుల కింద నెలకు అదనంగా 500 రూలను ఇవ్వనున్నట్టు కమీషనర్ శశిధర్ తెలిపారు.

అంతేగాక ఇంటింటీ బియ్యం పంపిణీ చేసి లబ్దిదారుల వేలిముద్రలు సేకరించి అథంటికేషన్ చేసేందుకు వీలుగా ప్రతి వాలంటీరుకు ఒక ఇపోస్ యంత్రంతోపాటు స్మార్ట్ ఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు


 

Follow Us:
Download App:
  • android
  • ios