ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషన్.. హాజరైన సీఎం జగన్..
ఆంధ్రప్రదేశ్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ బిశ్వభూషన్.. పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో అక్కడ ఏర్పాటు చేసిన పరేడ్ను పరిశీలించారు.
ఇక, ఈ రోజు ఉదయం ట్విట్టర్ వేదికగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శుభాకాంక్షలను తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. గణతంత్ర దినోత్సవం ఆ గొప్ప దేశభక్తులందరి సంస్మరణ దినం. వారి త్యాగాల వల్లే ఈ రోజు మనం స్వేచ్ఛా ఫలాలను అనుభవించడం సాధ్యమైంది. ఇది సత్యం, అహింస, శాంతి, ఐకమత్యం, సార్వత్రిక సౌభ్రాతృత్వం ఉదాత్తమైన ఆదర్శాలకు పున: అంకితం చేసే రోజు.. అవననీ స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటాన్ని ప్రేరేపించాయి. ఈ రోజును నిజంగా గుర్తుండిపోయేలా చేయడానికి ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు.