పార్టీ మార్పుపై తేల్చేసిన బిజెపి నేత గోకరాజు గంగరాజు
తాను వైసీపిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై బిజెపి నేత గోకరాజు గంగరాజు స్పందించారు. గంగరాజుతో పాటు ఆయన కుమారుడు రామరాజు, ఆయన సోదరుడు నరసింహరాజు వైసీపిీలో చేరుతారని వార్తలు వచ్చాయి.
విజయవాడ: తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై బిజెపి నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు స్పష్టత ఇచ్చారు. ఆయన బిజెపికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెసులో చేరబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తాను వైసిపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని గోకరాజు గంగరాజు స్పష్టం చేశారు. తాను విశ్వహిందూ పరిషత్ (విహెచ్ పి) జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నట్లు, విహెచ్ పిలోనే కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా తాను పార్టీ మారబోనని ఆయన చెప్పారు.
Also Read: బిజెపికి షాక్... వైసిపిలోకి గోకరాజు, ముహూర్తం ఖరారు
సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపిలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. కుమారుడు రామరాజు, తమ్ముడు నరసింహరాజులతో కలిసి ఆయన వైసీపిలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే, రామరాజు, నరసింహరాజులు మాత్రం వైసీపిలో చేరే అవకాశం ఉంది.
2019 ఎన్నికల్లో గోకరాజు రంగరాజు వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణమరాజుపై పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి గెలిచిన రఘురాజ కృష్ణమరాజు బిజెపి దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోకరాజు గంగరాజు వైసీపిలోకి వస్తారని ప్రచారం ఊపందుకుంది.