దొంగచాటు పెళ్లి.. ప్రియుడిని కత్తితో పొడిచి హత్య... ఆపై..
ప్రేమించాడు.. పెళ్లి చేసుకోమంటే దొంగచాటుగా తాళి కట్టాడు. సహజీవనం చేశాడు. కానీ పెళ్లి విషయం అందరికీ తెలిసేలా బహిరంగంగా పెళ్లి చేసుకుందాం అంటే కులాలు వేరంటూ నిరాకరించాడు. దీంతోపాటు అనుమానంతో వేధించాడు. సోషల్ మీడియాను వేదికగా తప్పుడు ప్రచారం ప్రారంభించాడు. ఈ మోసాన్ని, అవమానాన్ని భరించలేని యువతి అతన్ని హతమార్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది.
ప్రేమించాడు.. పెళ్లి చేసుకోమంటే దొంగచాటుగా తాళి కట్టాడు. సహజీవనం చేశాడు. కానీ పెళ్లి విషయం అందరికీ తెలిసేలా బహిరంగంగా పెళ్లి చేసుకుందాం అంటే కులాలు వేరంటూ నిరాకరించాడు. దీంతోపాటు అనుమానంతో వేధించాడు. సోషల్ మీడియాను వేదికగా తప్పుడు ప్రచారం ప్రారంభించాడు. ఈ మోసాన్ని, అవమానాన్ని భరించలేని యువతి అతన్ని హతమార్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది.
వివరాలు.. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన గర్సికూటి పావని కొవ్వూరు ఏబీఎన్ అండ్ పీఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తాడేపల్లిగూడెంలో ఇంటర్ చదువుతున్న సమయంలో అంబటి కరుణ తాతాజీనాయుడు అనే వ్యక్తితో ప్రేమలో పడింది.
కొన్నాళ్లపాటు ఇద్దరు కలిసి తిరిగారు. అయితే పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి తాతాజీ నిజస్వరూపం బయటపడింది. కులాలు వేరంటూ పెళ్లికి నిరాకరించాడు. కానీ, యువతి ఒత్తిడి చేయడంతో దొంగచాటుగా తాళి కట్టాడు. ఆ తర్వాత కొంతకాలం సహజీవనం కూడా చేశాడు.
అయితే ఇలా కాదని.. అధికారికంగా అందరిముందు తనను పెళ్లి చేసుకోవాలని పావని కోరింది. కానీ దీనికి తాతాజీ ససేమిరా అన్నాడు. అంతేగాకుండా పావనిపై అనుమానం పెంచుకుని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు.
ఈ క్రమంలో అతడి వేధింపులు తట్టుకోలేక యువతి తన స్వగ్రామమైన మలకపల్లి వచ్చేసింది. సోమవారం యువతికి ఫోన్ చేసి మాట్లాడే పని ఉందని ఐ.పంగిడి జంక్షన్కి రావాలని తాతాజీనాయుడు కోరాడు. దీంతో పావని అక్కడికి వచ్చింది. అక్కడ వారిద్దరి మాటలు గొడవకు దారి తీశాయి.
దీంతో తనను ఇంటి దగ్గర దింపి రావాలని పావని తాతాజీని కోరడంతో మోటారు సైకిల్పై బయల్దేరారు. అయితే అప్పటికే అతడి ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అతడిని హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో గతంలోనే ఆన్లైన్లో కొనుగోలు చేసిన చాకుతో అతడిపై దాడి చేసింది.
ధర్మవరం గ్రామ శివారుకు వచ్చేసరికి తాతాజీ నాయుడు మెడపై పొడిచింది. దీంతో మోటారు సైకిల్ పైనుంచి అతడు పడిపోవడంతో పలుచోట్ల కత్తితో కసిదీరా పొడిచింది. ఘటన స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పావని పోలీసులకు ఫోన్లో సమాచారం ఇచ్చి లొంగిపోయింది. రూరల్ ఎస్ఐ కె.రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, విచారణ చేపట్టారు.