నర్సాపురంలో గ్యాస్ పైప్లైన్ లీకేజీ: భయాందోళనలో స్థానికులు
పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం మండలం సీతారామపురం వద్ద ఓఎన్జీఃసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీతో మంటలు వ్యాపించాయి. దీంతో స్థానిక రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం మండలం సీతారామపురం వద్ద ఓఎన్జీఃసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీతో మంటలు వ్యాపించాయి. దీంతో స్థానిక రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ నుండి గ్యాస్ లీకు కావడంతో మంటలు వ్యాపించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మంటలను గుర్తించిన స్థానికులు ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఓఎన్జీసీ. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
గ్యాస్ పైప్లైన్లు వేసిన ప్రాంతాల్లో తరచుగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. కొన్ని సమయాల్లో ప్రమాదాలు పెద్ద ఎత్తున చోటు చేసుకొంటున్నాయి. కొన్ని ఘటనల్లో మంటలను ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా ఇబ్బందులు పడిన ఘటనలు కూడ ఉన్నాయి. కొన్ని ఘటనల్లో ఆస్థి, ప్రాణ నష్టం కూడ చోటు చేసుకొన్న ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకొన్నాయి.పైప్లైన్ వేసిన ప్రాంతాల్లో తరచుగా గ్యాస్ లీకౌతున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే విన్నవించినా కూడ అధికారుల నుండి సరైన స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.