తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం... రూ.10 కోసం గొడ్డలితో దాడి
తాడేపల్లిలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయాయి. రాజకీయ నాయకుల అండతో పోలీసులను సైతం లెక్కచేయకుండా వీరంగం సృష్టిస్తున్నారని స్ధానికులు చెబుతున్నాారు.

గుంటూరు : గంజాయి మత్తు జీవితాలు చిత్తయిపోతున్నాయి. గంజాయి మైకంలో కొందరు అమాయకులపై దాడులకు పాల్పడుతూ వీరంగం సృష్టిస్తున్నారు. ఇలా తాడేపల్లి ముగ్గురోడ్డులో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో కేవలం పది రూపాయల కోసం గొడవజరగ్గా ఒకరు గొడ్డలి దాడికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
గంజాయి బ్యాచ్ దాడితో తాడేపల్లిలో కలకలం రేగింది. ముగ్గు రోడ్డు పరిసరాలను గంజాయి బ్యచ్ అడ్డాగా చేసుకుందని... రాత్రయితే చాలు గంజాయి మత్తులో వీరంగం సృష్టిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మత్తులో మారణాయుధాలు పట్టుకుని వచ్చి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని... రాత్రయితే భయటకు రావాలంటే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురోడ్డు ప్రాంతంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని...దీంతో యువత వీటికి బానిస అవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ గంజాయి అమ్మకాల వెనక రాజకీయ నాయకుల హస్తం వుండటంతో పోలీసులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఈ దాడితో అయినా పోలీసులు స్పందించి ముగ్గురోడ్డు ప్రాంతంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గంజాయి బ్యాచ్ ను అదుపుచేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read More ఈ లేడీ యమ కిలాడీలా వుందే... మందు కోసం ఏకంగా చిన్న సొరంగమే తవ్వేసిందిగా..! (వీడియో)
ముగ్గురోడ్డు ఘటనపై తాడేపల్లి సీఐ మల్లికార్జునరావు స్పందించారు. గంజాయి మత్తులో దారుణంగా ప్రవర్తించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై ముగ్గురోడ్డు పరిసరప్రాంతాల్లో పోలీసులు నిఘా ఉంటుందన్నారు. స్థానికుల కోరుతున్నట్లే సిసి కెమెరాలు ఏర్పాటుచేసి గంజాయి బ్యాచ్ ఆగడాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని... ఇకపై ఎలాంటి అంవాఛనీయ ఘటనలు జరక్కుండా చూసుకుంటామని సీఐ తెలిపారు.