Free DSC Coaching in AP: డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తులను అభ్యర్థులు నమోదు చేస్తుండగా.. మరోవైపు కోచింగ్‌కు సిద్దమవుతున్నారు. ఈక్రమంలో అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షకు సన్నద్దం అవుతున్న అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంత్రి సవిత చేతుల మీదుగా ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్ కోచింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే.. ఈ కోచింగ్‌ బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులు వినియోగించుకోవచ్చని సూచించారు. కేవలం ఓ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని రోజంతా తరగతులు వినవచ్చని మంత్రి తెలిపారు. 

కాకినాడ శ్యాం ఇనిస్టిట్యూట్‌ వారి సౌజన్యంతో ఆచార్య అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌ను అభ్యర్థులు తమ ఫోన్‌లో ఇన్‌ స్టాల్‌ చేసుకుని తరగతులు వివవచ్చు. అయితే.. డీఎస్సీ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న వారు ఈ యాప్‌ ద్వారా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తరగతులు వినేలా ఏర్పాట్లు చేశారు. 

ఆన్‌లైన్‌తోపాటు... ఆఫ్‌లైన్‌లో తరగతులు వినేవారికి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని బీసీస్టడీ సర్కిల్లలో కోచింగ్‌ తరగతులు కొనసాగుతున్నాయని మంత్రి సవిత తెలిపారు. అభ్యర్థులు ఈ తరగతులను వినియోగించుకోవాలని కోరారు. 

ఆచార్య యాప్ ద్వారా కోచింగ్.. 
ప్రభుత్వం తీసుకొచ్చిన ఆచార్య యాప్‌ ద్వారా నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన చేపడున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అభ్యర్థులు తరగతులు వినడంతోపాటు... సందేహాలు ఏమైనా ఉంటే వాటిని డాష్‌ బోర్డులో నమోదు చేస్తే.. వెంటనే నిపుణులు సమాధానాలు ఇస్తారన్నారు. తరగతులతోపాటు ఆన్‌లైన్‌ మెటీరియల్‌, డీఎస్సీ పాత పరీక్ష పత్రాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. యాప్‌కి సంబంధించి సాంకేతిక సమస్యల పరిష్కారానికి జిల్లాకు ఇద్దరు నిపుణులను నియమించినట్లు మంత్రి సవిత తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే వారికి చెబితే వారు పరిష్కరిస్తారన్నారు. 

ఆన్‌లైన్‌ కోచింగ్‌ సుదూర ప్రాంతాలకు వెళ్లలేని వారికి గృహిణులకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి సవిత తెలిపారు. ఇప్పటి వరకు 3,189 మంది యాప్‌లో తరగతులు వింటున్నారని అన్నారు. యాప్‌ ద్వారా ఎంతమందికైనా శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ కింద 16,347 పోస్టులను భర్తీ చేయబోతోంది. దీంతోపాటు అభ్యర్థుల వయోపరిమితి కూడా 42 నుంచి 44కు పెంచింది. దీంతో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు.