ఏపీకి మూడు రాజధానులు అనే విషయం టీడీపీకి చిక్కులు తెచ్చి పెడుతోంది. విశాఖకు చెందిన టీడీపీ నేతలు విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. 

విశాఖపట్టణం: మూడు రాజధానుల అంశం టీడీపీలో చిచ్చు రేపుతోంంది. విశాఖను వాణిజ్య రాజధానిగా చేయాలనే ప్రతిపాదనను విశాఖ నగరానికి చెందిన టీడీపీ నేతలు మద్దతు పలికారు. ఈ విషయాన్ని టీడీపీ పార్టీరాష్ట్ర నాయకత్వానికి కూడ పంపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also read:రైతుల సమస్య కాదు, రాజధాని సమస్య: కన్నా

మంగళవారం నాడు విశాఖ నగరానికి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేయాలన్న ప్రతిపాదనను భేషరతుగా సమర్ధించాల్సిందేనని టీడీపీ సమావేశం తీర్మానం చేసింది.

కార్యానిర్వహక రాజదానిగా విశాఖపట్టణాన్ని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని విశాఖ అర్భన్ రూరల్, జిల్లా తెలుగుదేశం పార్టీ శాఖలు స్వాగతించాయి. ప్రతి నెల టీడీపీకి చెందిన ముఖ్య నేతలు డిన్నర్‌ సమావేశాలు నిర్వహించుకొంటారు. ఇందులో భాగంగానే మంగళవారం నాడు రాత్రి ఓ హోటల్‌లో టీడీపీ నేతలు సమావేశమయ్యారు.

ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, ఎమ్మెల్సీలు, దువ్వారపు రామారావు, బుద్దా నాగ జగదీశ్వరరావు, పప్పల చలపతిరావు, పార్టీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్, రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, భరత్, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద్, వంగలపూడి అనిత, కెఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.రాజధానికి అన్ని రకాల హంగులు కూడ విశాఖపట్టణానికి ఉన్నాయని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. 

విశాఖను కార్యానిర్వహక రాజధాని ప్రతిపాదనను వెంటనే స్వాగతించినట్టుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖపట్టణం అభివృద్ది చెందేందుకు ఇదే సమయమన్నారు. అందుకే ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు తాను మద్దతిచ్చినట్టుగా ఆయన తెలిపారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి నివేదిక పంపాలని కూడ నిర్ణయం తీసుకొన్నారు. 

కార్యానిర్వహక రాజధాని ఏర్పడితే పెరిగే జనాభాకు అనుగుణంగా చేపట్టే చర్యలపై శాంతిభద్రతలపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, సబ్బం హరి, చింతకాయల అయ్యన్నపాత్రుడులు దూరంగా ఉన్నారు.

పరిపాలన వికేంద్రీకరణను టీడీపీ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించారు. అమరావతిలో రైతుల ఆందోళనకు చంద్రబాబునాయుడు మద్దతు ప్రకటించారు.

జగన్ వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబునాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు రాజధానుల విషయమై ఎవరూ కూడ మాట్లాడకూడదని చంద్రబాబునాయుడు ఇప్పటికే పార్టీ నేతలకు సూచించారు.