వైయస్సార్ జయంతి  సందర్భంగా పులివెందులలో స్కిల్ ట్రయినింగ్ అకాడమీకి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. 

అమరావతి: రేపు(గురువారం) కడప జిల్లా పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ శంకుస్థాపన జరగనున్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం నుంచి నైపుణ్య వెలుగులకు అంకురార్పణ జరగడం ఆనందదాయకమన్నారు. వైయస్సార్ జయంతి సందర్భంగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''అత్యాధునిక సౌకర్యాలతో 7 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ ట్రైనింగ్ అకాడమీని నిర్మించనుంది. 'వైయస్సార్ జయంతి' నాడు ముఖ్యమంత్రి నైపుణ్య కల సాకారానికి మొదటి అడుగు పడటం మంచి పరిణామం. ఉపాధి అవకాశాల కోసం రాష్ట్ర యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం'' అని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. 

''మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుడతాం. మరో 5 మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ లకూ శ్రీకారం చుడతాం. దీంతో రాష్ట్రమంతా నైపుణ్య వికాసం, ఉపాధి అవకాశాలు పరిమళించనున్నాయి'' అని మంత్రి అన్నారు. 

read more జలవివాదం: ప్రధాని మోడీకి జగన్ మరో లేఖ

''స్కిల్ ఏపీ మిషన్/ నైపుణ్య విశ్వవిద్యాలయం ధృవీకరించిన టెక్నికల్ అండ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్( (TVET)వంటి పరిశ్రమలకు అవసరమైన గ్లోబల్ నమూనా తరహా అత్యాధునిక కోర్సులతో యువతకు శిక్షణ తరగతులుంటాయి. వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలలో ఉపాధి అవకాశాలకు తగ్గట్లు అత్యాధునిక హంగులతో హైఎండ్ ల్యాబ్ ల స్థాపనకు పులివెందుల స్కిల్ డెవలప్మెంట్ అకాడమీని తీర్చిదిద్దనున్నాం'' అని మేకపాటి వెల్లడించారు. 

''నైపుణ్య కళాశాలలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను పెంచేలా సాంకేతిక ,శిక్షణ, అత్యాధునిక కోర్సులు, కొత్త కరికులమ్ రూపొందించాం. రాష్ట్రంలోనే మొట్టమొదటి స్కిల్ ట్రైనింగ్ అకాడమీ పులివెందులలోనే ఏర్పాటుకానుంది. పులివెందుల స్కూల్ అకాడమీ ఆర్కిటిక్ డిజైనింగ్ బాధ్యతలను ఏపీయూఐఏఎమ్ఎల్ నిర్వర్తించనుంది. రూపురేఖలు మార్చే డిజైనింగ్, డీపీఆర్ దశలో స్కిల్ కాలేజ్ వుంది. ఇప్పటికే పరిపాలన అనుమతులు , భూసేకరణ పూర్తయ్యింది. త్వరలోనే నిధుల సమీకరణ కూడా కొలిక్కి రానుంది'' అని మంత్రి మేకపాటి తెలిపారు. 

ఈ సందర్భంగా పులివెందుల స్కిల్ అకాడమీ నిర్మాణ బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖకు అప్పగిస్తూ న నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేసింది.