కాపుల రిజర్వేషన్లు కల్పించే అంశం కేంద్రం పరిధిలోని అంశమని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పడం దారుణమని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.  

కాకినాడ: కాపుల రిజర్వేషన్లు కల్పించే అంశం కేంద్రం పరిధిలోని అంశమని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పడం దారుణమని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.

ఆదివారం నాడు ఆయన  తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో తునిలో నిర్వహించిన  ఆందోళన సమయంలో తమకు మద్దతుగా నిలిచిన వైసీపీ అధినేత జగన్ ఇవాళ  కాపుల రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలో లేదని కేంద్రం పరిధిలో ఉందని చెప్పడం దారుణంగా ఉందన్నారు.

కేంద్రం పరిధిలో ఉన్న అంశాలపై పోరాటం చేస్తున్న జగన్.. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే విషయమై ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.  ఇతర కులాలకు నష్టం చేసి తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరడం లేదన్నారు. ప్రత్యేక కేటగిరి కింద  కాపులకు రిజర్వేషన్లను కల్పించాలని కోరుతున్నామని ముద్రగడ చెప్పారు.

తుని ఘనటలో తమకు మద్దతుగా నిలిచిన వైఎస్ జగన్ ఇవాళ యూ టర్న్ తీసుకోవడం పట్ల  ముద్రగడ పద్మనాభం అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ జాతి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రాని జగన్‌కు తాము ఏందుకు ఓట్లు వేయాలని  ఆయన ప్రశ్నించారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  తమ జాతికి రిజర్వేషన్లు కల్పించే విషయమై న్యాయం చేస్తారనే  ఆశాభావాన్ని ముద్రగడ వ్యక్తం చేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యక్తిగత విమర్శలు  చేయడం సరైందికాదన్నారు.

రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను లాగకూడదన్నారు. పాదయాత్ర సందర్భంగా  జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు  కేంద్ర బడ్జెట్ కూడ  సరిపోదని ముద్రగడ ఎద్దేవా చేశారు.