కాంగ్రెస్కు షాక్: ఆగష్టు 31న టీడీపీలోకి కొండ్రు మురళి, త్వరలోనే మరికొందరు
శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళి ఆగష్టు 31వ తేదీన అమరావతిలో టీడీపీలో చేరనున్నారు. కొండ్రు మురళి టీడీపీలో చేరడాన్ని మాజీ మంత్రి ప్రతిభా భారతి వ్యతిరేకిస్తున్నారు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళి ఆగష్టు 31వ తేదీన అమరావతిలో టీడీపీలో చేరనున్నారు. కొండ్రు మురళి టీడీపీలో చేరడాన్ని మాజీ మంత్రి ప్రతిభా భారతి వ్యతిరేకిస్తున్నారు. కొండ్రు మురళి చేరికతో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.
2019 ఎన్నికల్లో టీడీపీని మరో సారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు గాను చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలకు టీడీపీ టచ్లోకి వెళ్లింది.
ప్రకాశం జిల్లాకు చెందిన ఉగ్ర నరసింహారెడ్డి కూడ రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడును కలిశారు. ఆయన కూడ త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం కొందరికి మింగుడు పడడం లేదు.
రాజాం నియోజకవర్గానికి చెందిన తన వర్గీయులతో మాజీ మంత్రి కొండ్రు మురళి ఇప్పటికే సమావేశమై టీడీపీలో తన నిర్ణయాన్ని అనుచరులకు చెప్పినట్టు సమాచారం. మరో వైపు కొండ్రు మురళి ఆదివారం నాడు తన ముఖ్య అనుచరులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత రాజాం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతలతో కూడ ఆయన సమావేశమయ్యే అవకాశాలున్నాయి.
ఆగష్టు 31వ తేదీన మురళి చంద్రబాబునాయుడు సమక్షంలో అమరావతిలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో రాజాం నుండి కొండ్రు మురళి పోటీ చేసే అవకాశం ఉంది.
ఈ వార్త చదవండి
ఏపీలో కాంగ్రెస్కు భారీ షాక్: టీడీపీలోకి క్యూ కడుతున్న నేతలు