Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు హయంలో నిఘా చీఫ్: ఏబీ వెంకటేశ్వర రావుకు బిగ్ షాక్

ఎపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ప్రభుత్వం నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వర రావు చంద్రబాబు హయాంలో నిఘా విభాగం చీఫ్ గా పనిచేశారు.

Former intelligence chief AB Venkateswar Rao suspended
Author
Amaravathi, First Published Feb 9, 2020, 9:47 AM IST

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వర రావుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వర రావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్ష, అపీల్) నిబంధనల నియమం 3(1) కిం ఆయనను సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో తెలిపారు. పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వర రావు భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 

ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు నివేదికలో తేలిందని అంటున్నారు. ఏబీ వెంకటేశ్వర రావు పోలీసు ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. 

ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ఇండియన్ ప్రొటోకాల్ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయని, దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్లేందుకు వీలు లేదని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.

1989 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర రావును ప్రజా ప్రయోజనాల రీత్యా సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. డీజీపీ స్థాయి అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర రావుకు గత 8 నెలలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios