టిడిపి-బిజెపి పొత్తులపై ఫ్లెక్సీ కలకలం
- గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద శనివారం తెల్లవారి కనబడిన పెద్ద పోస్టర్ నగరంలో కలకలం రేపుతోంది.
తెలుగుదేశంపార్టీ-భాజపా పొత్తులపై వెలసిని ఓ పోస్టర్ వైరల్ గా మారింది. గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద శనివారం తెల్లవారి కనబడిన పెద్ద పోస్టర్ నగరంలో కలకలం రేపుతోంది. ‘బిజెపితో పొత్తు..ఇంటికి రాదు విత్తు..మన గింజలు కూడా మనకు దక్కవు’ అని రాసున్న ఫ్లెక్సి ఎవరు పెట్టిందో తెలీటం లేదు. మొత్తానికి టిడిపి అభిమానులో లేక నేతలో ఎవరు పెట్టారో అర్ధం కావటం లేదు.
బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. టిడిపిలోని నేతల్లో చాలామంది బిజేపితో పొత్తు వద్దంటూ చంద్రబాబునాయుడుకు గట్టిగా చెబుతున్నారు. ఇటువంటి నేపధ్యంలో వెలసిన ఫ్లెక్సీ కలకలమే రేపుతోంది. సరే, ఇంత జరిగిన తర్వాత పోలీసుల దృష్టిలోకి వెళ్ళకుండా ఉంటుందా? అందుకే పోలీసులు రంగప్రవేశం చేసి ఫ్లెక్సీని ఎవరు పెట్టారన్న విషయం ఆరాతీస్తున్నారు.