విజయవాడలో అమానుషం... ఐదేళ్ల కూతురిపై కన్నతండ్రి అత్యాచారం
ఐదేళ్ల చిన్నారిపై కన్న తండ్రే అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వావివరసలు మరిచి సమాజమే తలదించుకునేలా వ్యవహరించాడు నీచుడైన తండ్రి.
విజయవాడ: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి. ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మానవ సంబంధాలకు మచ్చలాంటి ఈ అమానుషం విజయవాడలో చోటుచేసుకుంది.
విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీతో పాటు వికాస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చినబాబు అనే వ్యక్తి పీడీగా పనిచేస్తున్నాడు. అతడు కొన్నేళ్ల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్ల వయసున్న కూతురు వుంది.
కామంతో కళ్లు మూసుకుపోయిన చినబాబు ఏ తండ్రీ చేయని నీచపు పని చేశాడు. కన్న కూతురిపై కన్నేసిన అతడు భార్య ఇంట్లో లేని సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుషం తర్వాత బాలిక తీవ్ర బాధతో విలవిల్లాడిపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. దీంతో ఈ కీచక తండ్రి నీచపు పని గురించి బయటపడింది.
ప్రేమించి పెళ్ళిచేసుకున్నవాడే కూతురిపై అఘాయిత్యానికి పాల్పడటాన్ని ఆ మహిళ జీర్ణించుకోలేకపోతోంది. భర్త అకృత్యంపై సదరు మహిళ దిశ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసింది. దీంతో పరమ నీచుడైన బాలిక తండ్రిపై పొక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తండ్రి చేతిలో లైంగిక దాడికి గురయిన చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే భర్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని చిన్నారి తల్లికి బెదిరింపులు ఎదురవుతున్నాయి. అయినప్పటికి ఆమె తన కూతురికి జరిగిన అన్యాయంపై పోరాటానికే సిద్దమయ్యింది.