నిరుద్యోగ యువతకు తీపికబురు... వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు
వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వైద్య సిబ్బంది అద్భుతంగా పోరాడుతున్నారని అన్నారు. అయితే ఈ మహమ్మారిపై మరింత సమర్ధవంతంగా పోరాడేందుకు మరింతమంది వైద్య సిబ్బంది అవసరమని...వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
కోవిడ్ 19పై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ... కోవిడ్పై ఇప్పుడిక అవేర్నెస్, ఎడ్యుకేట్ చేయడం మన ముందున్న కర్తవ్యమని అన్నారు. ఇంటర్ స్టేట్ బార్డర్స్ ద్వారా రాకపోకల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం. 6 రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్న అధికారులు అందుకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు.
అలాగే కోవిడ్ క్లస్టర్ల వివరాలు, ఏరియా సైజ్ వివరాల గురించి సీఎం ఆరా తీశారు. క్లస్టర్ల క్లాసిఫికేషన్ను మరోసారి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా కోవిడ్ భాదితులు నేరుగా పరీక్షలు చేయించుకోవాలని... ఎక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అన్న అవగాహన ప్రజల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్లు స్వచ్చందంగా ఎలా చేయించుకోవాలి, ఒకవేళ పాజిటివ్ వస్తే ఏం చేయాలి అన్నదానిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. 14410, 104 నెంబర్లకు మరింత ప్రచారం కల్పించాలని ఆదేశించారు.
READ MORE ఏపీలో కరోనావిజృంభణ: కొత్త 154 పాజిటివ్ కేసులు, మొత్తం 75 మంది మృతి
''కరోనా వచ్చినా కంగారు పడొద్దు అనే విధంగా ప్రజల్లో ధైర్యాన్ని కలిగించేలా విస్తృతంగా ప్రచారం చేయండి. ప్రభుత్వం తరపున ఎడ్యుకేట్ చేయడం ఒక పని అయితే మరోవైపు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ప్రతీ ఇంటికి విస్తృతంగా ప్రచారం చేయండి. వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. కరోనా లక్షణాలు కనిపిస్తే ఏ విధంగా ముందుకెళ్ళాలి అని ప్రతీ ఇంటికీ తీసుకెళ్ళండి. టీవీ యాడ్స్, న్యూస్ పేపర్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయండి'' అని అధికారులకు సీఎం సూచించారు.
''ప్రజలకు భరోసా ఇచ్చేలా ప్రచారం ఉండాలి. పాజిటివ్ వస్తే తీసుకోవాల్సిన వైద్యం, జాగ్రత్తలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన రావాలి. వచ్చే 2, 3 వారాలు మరింత ముమ్మరంగా ప్రచారం చేయండి. ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలు, వాలంటీర్ల సహకారంతో ముందుకెళ్ళండి. అనుమానం ఉండి ఫోన్ చేసిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టండి'' అని ఆదేశించారు.
అంతర్జాతీయ విమానాలు, దేశీయ విమానాల రాకపోకల గురించి జగన్ ఆరా తీశారు. గడిచిన వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో నమోదయిన కేసుల వివరాలు సీఎంకి వివరించారు అధికారులు. పాజిటివిటీ రేట్, మోర్టాలిటీ రేట్, జిల్లాల వారీగా నిర్వహించిన టెస్ట్లు, నమోదయిన కేసుల వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు.
ఏఏ జిల్లాల్లో ఏఏ ప్రాంతాల్లో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి, జిల్లాల వారీగా హాట్స్పాట్లు, కేసులు ఎక్కువగా నమోదవడానికి గల కారణాలకు సీఎంకు వివరించారు. మొత్తం జిల్లాలవారీగా 71 సెంటర్లలో 15,614 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియజేశారు.
మొత్తంగా ఇప్పటివరకూ 4,54,030 శాంపిల్స్కు గాను 4,659 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వెల్లడించారు. అందుబాటులో ఉన్న డాక్టర్లు, ఇతర వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది వివరాలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. మోర్టాలిటీ రేట్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.
READ MORE ఏపీ సచివాలయంలో పది మందికి కరోనా: ఈ నెల 11న కేబినెట్ వేదిక ఎక్కడ..?
బార్డర్స్ నుంచి వచ్చే వారు ఎక్కువసేపు వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. వార్డ్, విలేజ్ క్లీనిక్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.