కృష్ణా జిల్లాలో భయం భయం... 19మంది రైతులకు పాముకాటు
పొలం పనుల సమయంలో రైతులు భారీ సంఖ్యలో పాముకాట్లకు గురవుతున్న సంఘటనలు కృష్ణా జిల్లాలో ఎక్కువయ్యాయి.
విజయవాడ: పొలం పనుల సమయంలో రైతులు భారీ సంఖ్యలో పాముకాట్లకు గురవుతున్న సంఘటనలు కృష్ణా జిల్లాలో ఎక్కువయ్యాయి. ఇవాళ జిల్లాలోని పమిడిముక్కల మండలం గండ్రగూడెంలో ముగ్గురికి పాము కాటుకు గురయ్యారు. పొలంలో పనిచేస్తున్న ముగ్గురు రైతులను రక్త పింజరి కాటువేసింది. దీంతో వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
సమయానికి ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందన్న వైద్యులు శొంఠి శివరామకృష్ణ తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు 19 పాము కాటు కేసులు నమోదయ్యాయన్న ఆయన వెల్లడించారు.
వర్షాకాలంలో బొరియల్లోంచి బైటకు వచ్చే పాములు వరి మళ్లలో ఎలుకల కోసం సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళుతున్న రైతులు ఈ పాముల కాటుకు గురై చనిపోతున్నట్లు అధికారులు తెలిపారు. పాముకాటు బాధితుల కోసం గ్రామాల్లోని ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో కూడా మందులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.