భూమి కోసం ఆరాటం... తహసీల్దార్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రైతు ఆదినారాయణ తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నాడు. చాంబర్లో ఉన్న తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి ఎదుట తన ఒంటిపై బాటిల్లోని పెట్రోలు పోసుకున్నాడు. వెంటనే అప్రమత్త మైన సిబ్బంది ఆదినారాయణను పక్కకు లాగి నీళ్లు చల్లి పోలీసులకు అప్పజెప్పారు.
తన భూమి తనకు కాకుండా పోతుందనే బాధతో ఓ రైతు తహసీల్దార్ ఎదుట పెట్రోల్ పోసుకున్నాడు. నిప్పు కూడా అంటించుకోబోతుండగా... సిబ్బంది అడ్డుకొని అతనిని రక్షించారు. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.... కడప జిల్లా కొండాపురం మండలంలోని దత్తపురం గ్రామానికి చెందిన బుడిగి ఆదినారాయణ(46) అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామం 122 సర్వేనెంబర్లో 10.94ఎకరాల డీకేటీ భూమి ఉంది. ఇందులో 3.50 ఎకరాల భూమికి బుక్కపట్నం గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి గండికోట ప్రాజెక్టు కింద ముంపు పరిహారం తీసుకున్నాడు.
మిగిలిన భూమిలో నరసింహులు, ఆదినారాయణకు మధ్య వివాదం ఉంది. ఇందులో 3.50 ఎకరాలు తన తండ్రి పేరుతో ఉందని, చాలా కాలం నుంచి తమ అనుభవంలో ఉందని, ఆ భూమిని తన తల్లి పేరుమీద ఆన్లైన్ చేయాలంటూ ఆదినారాయణ ఐదు సంవత్సరాల కిందట హైకోర్టును ఆశ్రయించారు. మూడు సంవత్సరాల నుంచి ఆన్లైన్లో భూమిని నమోదు చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తరచూ తిరుగుతున్నాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రైతు ఆదినారాయణ తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నాడు. చాంబర్లో ఉన్న తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి ఎదుట తన ఒంటిపై బాటిల్లోని పెట్రోలు పోసుకున్నాడు. వెంటనే అప్రమత్త మైన సిబ్బంది ఆదినారాయణను పక్కకు లాగి నీళ్లు చల్లి పోలీసులకు అప్పజెప్పారు.
కాగా... ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ లో భూమి వివాదంలో ఓ రైతు తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో తహసీల్దార్ సజీవదహనమయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో... ఇలాంటి ఘటనలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.