ప్రేమ పెళ్లి... పరువు కోసం వధువు నోట్లో విషం పోసి..
ఈ నెల 5న ఇంట్లోవారికి తెలియకుండా వెళ్లి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అదేరోజు తమ కుమార్తె కనిపించలేదని యువతి తల్లిదండ్రులు సీతారామపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వారిద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే.. వారి ప్రేమ పెళ్లి యువతి తల్లిదండ్రులకు నచ్చలేదు. వారిని చంపైనా తమ పరువు కాపాడుకోవాలని అనుకున్నారు. నూతన వధూవరులపై దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సంగసానిపల్లి కి చెందిన బాలకృష్ణ, దేవమ్మచెరువు గ్రామానికి చెందిన ఎం.అనిత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5న ఇంట్లోవారికి తెలియకుండా వెళ్లి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అదేరోజు తమ కుమార్తె కనిపించలేదని యువతి తల్లిదండ్రులు సీతారామపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు.. వాళ్లిద్దరూ ఆళ్లగడ్డలో బంధువుల వద్ద ఉన్నారని తెలుసుకున్నారు. ఎస్సై రవీంద్రనాయక్ సిబ్బందితో కలిసి వెళ్లి వారిద్దరినీ మంగళవారం సీతారామపురం తీసుకొచ్చి తహసీల్దార్ వెంకటసునీల్ వద్ద హాజరుపరిచారు. ఇద్దరూ మేజర్లు కావడం, తన భర్తతో వెళతానని అనిత చెప్పడంతో వారిని బాలకృష్ణ ఇంటికి పంపించారు.
ఈ విషయం తెలుసుకున్న అనిత బంధువులు సంగసానిపల్లి సమీపంలో అడ్డగించి వారిపై దాడిచేశారు. బాలకృష్ణ, అనితలను కొట్టారు. ఆమె నోట్లో పురుగుమందు పోశారు. అదే సమయంలో బాలకృష్ణ బంధువులు, పోలీసులు రావడంతో పరారయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనితను 108 వాహనంలో ఉదయగిరి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు తీసుకెళ్లారు. ప్రస్తుతం అనిత పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయగిరి సీఐ ప్రభాకర్రావు వైద్యశాలలో విచారణ చేపట్టారు. అనిత బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.