కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు: కాకినాడ సభలో వై.ఎస్. జగన్ సంచలనం
కాకినాడలో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కాకినాడ:రాబోయే రోజుల్లో మరిన్ని పొత్తులు పెట్టుకుంటారు...కుటుంబాలను చీలుస్తారు... రాజకీయాలు చేస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుధవారంనాడు కాకినాడలో పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. రానున్న రోజుల్లో కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు జరుగుతాయని జగన్ వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, కుతంత్రాలు కూడ ఎక్కువ జరుగుతాయన్నారు.
పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ పవన్ కళ్యాణ్ కేంద్రానికి లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. మోసాలు, అబద్దాలతో వస్తారు.. అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.
తాను నమ్ముకుంది పొత్తులు, ఎత్తులు కుట్రలు కాదని సీఎం జగన్ చెప్పారు.తాను దేవుడినే నమ్ముకున్నానని ఆయన చెప్పారు.
వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు వై.ఎస్. షర్మిల ఇవాళ రాత్రికి న్యూఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. షర్మిల చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. షర్మిలకు కీలక పదవి దక్కుతుందనే ప్రచారం సాగుతుంది. ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ తో షర్మిల భేటీ కానున్నారు. తన కొడుకు రాజారెడ్డి వివాహా పత్రికను జగన్ కు అందించనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల జగన్ తో భేటీ కానున్నారు. తన కొడుకు ఆహ్వాన పత్రికను అందించిన తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుండి షర్మిల న్యూఢిల్లీకి వెళ్లనున్నారు.