నకిలీ చలానాల కుంభకోణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణాజిల్లాలోని పటమట, మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ రెండు ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు అధికారులు.


ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ చలానాల కుంభకోణంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. సీఎం సూచనలతో రంగంలోకి దిగిన అధికారులు.. సబ్ రిజిస్ట్రార్ల పాత్రపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా కృష్ణాజిల్లాలోని పటమట, మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కువగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అయినా ఇప్పటికే పటమట, మండవల్లి సబ్ రిజిస్ట్రార్‌లు విధుల్లోనే వుండటం విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు వివిధ జిల్లాల రిజిస్ట్రార్‌లు .. ఆడిట్ రిజిస్ట్రార్‌ల నిర్లక్ష్యంపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సబ్ రిజిస్ట్రార్‌లతో పాటు ఆఫీసు సిబ్బందిపైనా విచారణకు రంగం సిద్ధం చేస్తున్నారు. విచారణతో పాటు రికవరీని ప్రాధాన్యంగా తీసుకున్నారు అధికారులు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ALso Read:నకిలీ చలానాల స్కామ్.. ఏసీబీ దిగితే కానీ బయటపడలేదు, మీరంతా ఏం చేస్తున్నారు: అధికారులపై జగన్ ఆగ్రహం

కాగా, కొద్దిరోజుల క్రితం నకిలీ చలానాల కుంభకోణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి నకిలీ చలానాలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప.. ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదని మండిపడ్డారు. వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో లేదో అధికారులు పట్టించుకోవడం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కార్యాలయాల్లో చలాన్ల ప్రక్రియను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాల్ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌పై అధికారులు దృష్టిపెట్టాలని జగన్ సూచించారు. చలాన్ల అక్రమాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో పరిశీలించాలని సీఎం ఆదేశించారు. మీ సేవ ఆఫీసుల్లో పరిస్థితులపైనా అధికారులు దృష్టి పెట్టాలని జగన్ సూచించారు.