చంద్రబాబు నాయుడికి కుడికంటికి శస్త్రచికిత్స ముగిసింది. హైదరాబాద్ లోని ఎల్వీప్రసాద్ నుంచి ఇంటికి చేరుకున్నారు.
హైదరాబాద్ : అనారోగ్య కారణాలతో మద్యంతర బెయిలుపై బయటికి వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాదులో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం నాడు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు కంటి శస్త్ర చికిత్స పూర్తయింది. ఆయనకు దాదాపు రెండు గంటలపాటు ఎల్వి ప్రసాద్ వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.
గత జూన్ లో చంద్రబాబు నాయుడు ఎడమ కంటికి సర్జరీ జరిగింది. ఆ తర్వాత మూడు నెలలకు కుడి కంటికి సర్జరీ జరగాల్సి ఉండగా.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకేసులో అరెస్టు, రిమాండ్ పై జైలుకు వెళ్లడం పరిణామాల నేపథ్యంలో కంటి వైద్యం వాయిదా పడింది. అది ఈరోజు జరిగింది. కంటి ఆపరేషన్ తర్వాత చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ నుంచి కాన్వాయ్ లో తన ఇంటికి వెళ్లిపోయారు. అంతకుముందు చంద్రబాబు నాయుడుకు ఏఐజీలో చర్మ సంబంధిత పరీక్షలు జరిగాయి.
ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ కు చంద్రబాబు... కాసేపట్లో కంటి ఆపరేషన్
ఇదిలా ఉండగా, నవంబర్ 2 న చంద్రబాబు జైలునుంచి బైటికి వచ్చారు. చంద్రబాబు వయసు 73 సంవత్సరాలు. ఆయన ఫిట్ గానే ఉన్నానని చెబుతున్నప్పటికీ వయసురీత్యా అనేక ఆరోగ్య సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి. ఈ మేరకు వైద్యులు నివేదిక అందించారు. ముందుగా చంద్రబాబుకు అత్యవసరంగా చేయాల్సింది కంటి కాటరాక్ట్ ఆపరేషన్. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టుకు ముందు ఈ జూన్లో చంద్రబాబు నాయుడు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది.
హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగిన సమయంలోనే మూడు నెలల్లో కుడి కంటికి కూడా ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. కానీ సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, జైలుకు వెళ్లడంతో ఆపరేషన్ తేదీ… దాటిపోయింది. దీంతోనే కంటి సమస్యలు తీవ్రమయ్యాయని తెలుస్తోంది.
దీంతోపాటు.. చంద్రబాబుకు చాలాయేళ్లుగా చర్మ సంబంధిత సమస్యలు ఉన్నాయి. జైలులో ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్ తో అవి మరింతగా పెరిగాయి. చంద్రబాబు వీపు, నడుము, చాతి, చేతులు, గడ్డం తదితర ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడ్డాయని దీంతో తీవ్రమైన దురద ఉందని జిజిహెచ్ చర్మ సంబంధ వైద్య నిపుణులు తెలిపారు.
ఇక చంద్రబాబు రెండు అరచేతుల్లో చీమ పొక్కులు ఏర్పడి అవి చితికి పోవడం వల్ల దురద, శరీరం మొత్తం తెల్లటి పొక్కులు ఏర్పడ్డాయని.. కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపులు కూడా ఏర్పడి ఇబ్బంది పడుతున్నారని జిజిహెచ్ వైద్య నిపుణులు జైలు అధికారులకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. ఈ కారణంగానే కోర్టు చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. ఏసీ ఏర్పాటుతో డిహైడ్రేషన్ తగ్గినా.. చర్మ సమస్యలు మాత్రం తగ్గలేదని సమాచారం.
మరోవైపు, ఇక చంద్రబాబుకు వెన్నునొప్పి కూడా బాధిస్తోందని తెలుస్తోంది. దీంతో ఆయనను పరీక్షించిన వైద్యులు ఒకే పొజిషన్ ఎక్కువసేపు కూర్చోవద్దని.. సౌకర్యవంతంగా ఉండే కూర్చునే వాడాలని తెలిపారు. దీంతోపాటు చంద్రబాబు మలద్వారం వద్ద కూడా నొప్పితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల నడుం కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నారు. మలవిసర్జన సరిగా లేకపోవండతో ఈ సమస్య ఏర్పటినట్టుగా చెబుతున్నారు.
