చంద్రబాబుకు నిరాశేనా ?
ప్రధానమంత్రి నరేంద్రమోడి తో జరిగిన భేటీలో చంద్రబాబునాయుడుకు తీవ్ర నిరాశే ఎదురైనట్లు సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్రమోడి తో జరిగిన భేటీలో చంద్రబాబునాయుడుకు తీవ్ర నిరాశే ఎదురైనట్లు సమాచారం. దాదాపు ఏడాదిన్నర తర్వాత తప్పని సరిపరిస్ధితుల్లో నరేంద్రమోడి ముఖ్యమంత్రికి అపాయిట్మెంట్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం వీరిద్దరూ దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
మీడియాతో చంద్రబాబు మాట్లాడిన తీరు గమనిస్తే వీరిద్దరి మధ్య భేటీ పెద్ద ఆశాజనకంగా సాగలేదని అర్ధమైపోతోంది. తర్వాత మీడియాతో మాట్లాడినపుడన్నా చంద్రబాబు దాటిగా మాట్లాడారా అంటే అదీ లేదు. మూడున్నర సంవత్సరాలుగా కేంద్రాన్ని ఏమి కోరుతున్నారో అవే విషయాలను మళ్ళీ ప్రధానితో ప్రస్తావించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
విభజన చట్టం సక్రమంగా అమలు కావటం లేదన్నారు. విశాఖపట్నం రైల్వేజోన్ కూడా మంజూరు చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 58 వేల కోట్లతో సమర్పించిన పూర్తిస్ధాయి అంచనాలను ఆమోదించమని అడిగారట. రాజధాని నిర్మాణం కోసం తగినంత నిధులను వచ్చే బడ్జెట్లో కేటాయించాలని కోరారట. రాష్ట్రంలోని నియోజకవర్గాల సంఖ్యను 175 నుండి 225కి పెంచాల్సిందిగా అడిగారట.
ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఈఏపీ రుణాల గురించి సీఎం ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. వీటి కింద రూ.20,010 కోట్లు రావాల్సి ఉండగా, ఐదేళ్లలో ఇంత మొత్తాన్ని ఈఏపీ ప్రాజెక్టులపై ఖర్చు పెట్టే సామర్థ్యం తమకు లేదని వివరించారు. ఆ మొత్తంతో పాత విదేశీ రుణాలు, చిన్న పొదుపు మొత్తాలు, నాబార్డు రుణాలు చెల్లించేందుకు, దేశీయ బ్యాంకులు, నాబార్డు, హడ్కో వంటి సంస్థల నుంచి రుణాలు తీసుకోవడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అరుణ్ జైట్లీకి రాసిన లేఖలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారట.
చంద్రబాబు మీడియాతో చెప్పిన దాంట్లే ఏమన్నా కొత్త విషయాలున్నాయా? మూడున్నరేళ్ళుగా కేంద్రాన్ని లేకపోతే ప్రధానికి అదీకాకపోతే అరుణ్ జైట్లీకి చేసుకున్న విజ్ఞప్తులే కదా అన్నీ? ఒక్కటంటే ఒక్కటన్నా సాదించగలిగారా? అంటే, ఏడాదిన్నర తర్వాత జరిగిన భేటీలో రాష్ట్రప్రయోజనాలకు నిరాసనే మిగిల్చినట్లు అర్ధమవుతోంది.