యాంకర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. దొరికిన సూసైడ్ నోట్
అడ్డంగా బుక్కైన భర్త
టీవీ యాంకర్ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. చనిపోవడానికి యాంకర్ తేజశ్విని రాసిన సూసైడ్ నోట్ ఒకటి పోలీసులకు దొరికింది. దీంతో.. దాని ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును 498ఏ, 306 సెక్షన్ల కింద మార్పు చేస్తూ సోమవారం సాయంత్రం కేసు నమోదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన తేజస్విని (26) ఐదేళ్ల క్రితం మట్టపల్లి పవన్కుమార్ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. తేజస్విని విజయవాడలోని ఓ ప్రైవేటు చానల్లో న్యూస్ రీడర్గానూ, పవన్కుమార్ ఉయ్యూరులోని బజాజ్ రిలయన్స్లో పనిచేస్తున్నారు.
ఈనెల 16వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో ఈడుపుగల్లులోని ఎంబీఎంఆర్ కాలనీలోని అద్దె ఇంట్లో ఉరివేసుకుని తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అర్థరాత్రి సమయంలో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
దర్యాప్తులో భాగంగా ఇంట్లో తనిఖీలు జరిపిన పోలీసులకు తేజశ్విని రాసిన సూసైడ్ నోట్ లభించింది. ‘ప్రేమించి, నమ్మి వచ్చినందుకు వేధించాడని, ఇబ్బందులు పెడుతున్నాడని, స్నేహితులే ఎక్కువ అయ్యారని, తనను పట్టించుకోవటం లేదని, ప్రవర్తన సరిగా లేదని అందుకే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు’ సూసైడ్ నోట్లో తేజస్విని పేర్కొన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో 498ఎ, 306 సెక్షన్ల కింద కేసులో మార్పులు చేసి దర్యాప్తు చేపట్టారు. తేజస్విని భర్త పవన్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం వరకూ మృతురాలి కుటుంబ సభ్యులు, పవన్కుమార్ కుటుంబ సభ్యులతో పోలీసుస్టేషన్ వద్ద రాజీ మంతనాలు జరిగినట్లు సమాచారం.