తన పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. గుంటూరు ఎంపీగా పోటీ చేస్తాననేది ఊహాజనితమేనని ఆయన స్పష్టం చేశారు.

తాను రాజకీయాల్లో చేరుతున్నానని.. గుంటూరు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. మంగళవారం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌తో భేటీ అయినప్పుడు రాజకీయాలు మాట్లాడలేదన్నారు. ప్రజలకు సేవ చేస్తానని.. కానీ అది ఏ విధంగా అనేది త్వరలోనే చెబుతానని అంబటి రాయుడు వెల్లడించారు. గుంటూరు ఎంపీగా పోటీ చేస్తాననేది ఊహాజనితమేనని.. త్వరలోనే క్షేత్ర స్థాయిలో ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకుంటానని అంబటి రాయుడు తెలిపారు. 

కాగా.. అంబటి రాయుడు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. త్వరలోనే అతడు అమెరికా వేదికగా జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) లో పాల్గొననున్నాడు. ఇది ముగిసిన తర్వాత రాయుడు తన లైఫ్ లో మరో ఇంట్రెస్టింగ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. వైఎస్సార్‌సీపీలో ఆయన చేరనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రాయుడు ఇప్పటికే పలుమార్లు ఆంధ్రా సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కలవడం.. ట్విటర్ లో జగన్ పై ప్రశంసలు కురిపించే పనిపెట్టుకోవడం కూడా అతడి ఎంట్రీని చెప్పకనే చెబుతున్నాయి. 

ALso Read: ఢిల్లీకా.. గల్లీకా..? రాయుడు రాజకీయం ఎక్కడ్నుంచి..? వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నాకే ప్రకటన!

రాయుడుది ఆంధ్రాలోని గుంటూరు జిల్లాలోని పొన్నూరు ప్రాంతం. ఇదే స్థానం నుంచి అతడు అసెంబ్లీకి పోటీ చేయాలని రాయుడు భావిస్తున్నాడని సమాచారం. అయితే అసెంబ్లీ కంటే అతడిని పార్లమెంట్ కే పంపించాలని ఏపీ సీఎం అనుకుంటున్నారంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గుంటూరు లేదా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గానీ రాయుడును పోటీ చేయించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల ఐపీఎల్ - 16 గెలిచిన తర్వాత జగన్‌ను కలిసిన రాయుడుతో కూడా సీఎం దీని గురించే చర్చించినట్టు గుసగుసలు వినిపించాయి.