కాసేపు కాపు అంటాడు.. మరోసారి బీసీ అంటాడు, పవన్ది ఏ కులం : వెల్లంపల్లి తీవ్రవ్యాఖ్యలు
ఏ కులమో చెప్పుకోలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ రోజుకో మాట, పూటకో వేషం వేస్తాడని.. జనసేన పనికిమాలిన పార్టీ అని చంద్రబాబుకు భజన చేయడమే దాని పనంటూ వెల్లంపల్లి విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన పదేళ్లలో ఒక్క సర్పంచ్ను కూడా గెలిపించుకోలేకపోయారని సెటైర్లు వేశారు. ఏ కులమో చెప్పుకోలేని వ్యక్తి పవన్ అంటూ దుయ్యబట్టారు. అప్పుడేమో కాపు అన్నాడని, నిన్నేమో బీసీ అంటున్నాడని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. పీఆర్పీ ఓడిపోయిన తర్వాత రోజే అన్న చిరంజీవిని వదిలేసిన వ్యక్తి పవన్ అంటూ శ్రీనివాస్ చురకలంటించారు. జనసేన పనికిమాలిన పార్టీ అని.. చంద్రబాబుకు భజన చేయడమే దాని పనంటూ వెల్లంపల్లి విమర్శలు గుప్పించారు. ప్యాకేజీకి అమ్ముడుపోయే పార్టీ అంటూ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీకి, జనసేనకు వుందా అని ఆయన ప్రశ్నించారు. జగన్ సింహాంలా సింగిల్గా వస్తారని.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. పవన్ రోజుకో మాట, పూటకో వేషం వేస్తాడంటూ ఆయన దుయ్యబట్టారు.
అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కాపులు పెద్దన్న పాత్ర వహిస్తే ఈ వ్యక్తి సీఎంగా వుండరని పవన్ అన్నారు. ఎట్టిపరిస్ధితుల్లో వైసీపీకి ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు. సంకల్పం లేకుంటే రూ.10 వేల కోట్లు వున్నా పార్టీని నడపలేమన్నారు. నువ్వెంత ఎదిగినా తన దగ్గరకు వచ్చి చేతులు కట్టుకోవాలనే ధోరణి సీఎం జగన్దని పవన్ ఎద్దేవా చేశారు. తాను ఓడిపోతే మీసాలు మెలేసి తొడలు కొట్టొంది కాపులేనన్నారు. తాను ఓడిపోతే మీకేంటీ ఆనందం అని ఆయన ప్రశ్నించారు. వాళ్లు మంచిగా వుండాలి.. మనలో మనం కొట్టుకోవాలి ఇదే వాళ్ల వ్యూహమని పవన్ వ్యాఖ్యానించారు. సంఖ్యా బలం ఎక్కువ వున్న కులాల్లో ఐక్యత వుండదని చాలా మంది వున్నారని.. అధికారం చూడని ఏ కులం కూడా ఈ మాట పడకూడదన్నారు.
ALso REad: టీడీపీ మంచిగా వుంటూనే.. నేను మెత్తని మనిషిని కాదు , మొహమాటాల్లేవ్ : పొత్తులపై మారిన పవన్ స్వరం
త్యాగాలు చేయాలి.. దానికి తాను కంకణం కట్టుకున్నానని పవన్ స్పష్టం చేశారు. కాపులు పార్టీని నడపలేరన్న విమర్శలకు చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకుడు చనిపోయినప్పుడు జిల్లాకు ఆయన పేరు పెట్టమనడం కాదన్నారు. ఆయన బతికి వున్నప్పుడు వెంట నడవాలని పవన్ పేర్కొన్నారు. తాను విరాళాలు ఇవ్వాలని ఎవ్వరిని ఆడగలేదని.. తన సొంత డబ్బుతో పార్టీని నడుపుతున్నానని పవన్ చెప్పారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఏ పార్టీ ఎజెండాల కోసం తాను పనిచేయడం లేదన్నారు. ఒకరేమో రూ.1000 కోట్లతో తాను డీల్ కుదుర్చుకున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
అధికారంలో వున్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు గౌరవం ఇచ్చి తీరాలని పవన్ పేర్కొన్నారు. గొడవ పెట్టుకుంటే ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడతారనే భయం ఉంటుందని ఆయన అన్నారు. తాను ఓటమిని భయపడే వ్యక్తిని కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పెట్టి పదేళ్లు గడిచిపోయిందని.. ప్రస్తుతం తాను ప్రతికూల వాతావరణంలోనే పార్టీని నడుపుతున్నానని పవన్ తెలిపారు. కాపులంతా తనకు ఓట్లు వేసుంటే భీమవరం, గాజువాకలలో ఓడిపోకూడదు కదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాల్లోనూ తనకు లక్షలాది అభిమానులు వున్నారని.. రెడ్లలోనూ తనకు అభిమానులు వున్నారని.. కానీ ఓటు మాత్రం వారి కులానికే వేసకున్నారని పవన్ చెప్పారు.