అన్ని కాకి లెక్కలే.. అది పాదయాత్ర కాదు , జంపింగ్ జపాంగ్ యాత్ర : లోకేష్పై పేర్ని నాని సెటైర్లు
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. లోకేష్ది జంపింగ్ జపాంగ్ యాత్ర అని పేర్ని నాని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ యాత్ర చేపట్టారని, లోకేష్ది అట్టర్ ఫ్లాప్ షో అని ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాయంత్రం సూర్యుడు దిగిపోయాక లోకేష్ బయటకు వస్తారని వ్యాఖ్యానించారు. లోకేష్ది జంపింగ్ జపాంగ్ యాత్ర అని పేర్ని నాని దుయ్యబట్టారు. మేనమామ కొడుకు చనిపోతే లోకేష్ కనీసం ఆసుపత్రికి కూడా వెళ్లలేదని ఆయన ఎద్దేవా చేశారు. లోకేష్ యాత్ర చేసిన కిలోమీటర్లన్నీ దొంగ లెక్కలేనని పేర్ని నాని సెటైర్లు వేశారు. రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ యాత్ర చేపట్టారని, లోకేష్ది అట్టర్ ఫ్లాప్ షో అని ఆయన వ్యాఖ్యానించారు.
యువగళం యాత్రతో టీడీపీ ఏం సాధించిందని నాని ప్రశ్నించారు. చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్ యాత్ర చేశారని పేర్ని నాని దుయ్యబట్టారు. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ బేరాలు చేసుకున్నారని.. చంద్రబాబు అధికారంలో వుండాలన్నదే పవన్ ఆరాటమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో ఏదైనా నెరవేర్చారా అని పేర్ని నాని ప్రశ్నించారు. హామీలను గాలికొదిలేసి చంద్రబాబు అడ్డంగా దోచుకున్నారని.. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎరవేయటం ఆయనకు అలవాటంటూ నాని చురకలంటించారు. ఇప్పుడు కొత్తగా హామీలు ఇవ్వడం మొదలుపెట్టారని.. చంద్రబాబు ఎన్ని తప్పుడు మాటలు, మోసాలైనా చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.
ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని పేర్నినాని నిలదీశారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని పేర్ని నాని విమర్శించారు. అలా విమర్శించిన వారే మూడు రెట్లు ఎక్కువ సంక్షేమం అందిస్తామంటున్నారని ఆయన చురకలంటించారు. అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రయత్నిస్తున్నాని నాని దుయ్యబట్టారు. మమ్మల్ని పాలేరులు అని తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరికి పాలేరుగా పనిచేస్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు.