లోకేష్ తో పంతం కోసం... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా..?: జవహర్ ఆగ్రహం (వీడియో)
కేవలం నారా లోకేష్ పరీక్షలను వాయిదా వేయమన్నందుకే ముఖ్యమంత్రి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని మాజీ మంత్రి కెఎస్ జవహర్ పేర్కొన్నాడు.
అమరావతి: తన పట్టుదల, పంతం కోసం జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడని మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ ఆరోపించారు. పరీక్షలు ఈరోజు కాకుంటే రేపు రాసుకోవచ్చు... ప్రాణం పోతే తీసుకురాగలమా? అని నిలదీశారు. కేవలం నారా లోకేష్ పరీక్షలను వాయిదా వేయమన్నందుకే ముఖ్యమంత్రి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని జవహర్ పేర్కొన్నాడు.
''అన్ని రాష్ట్రాలు పరీక్షలు వాయిదావేస్తే, తన పంతం నెగ్గించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు. పరీక్షలు నిర్వహిస్తే, విద్యార్థులతోపాటు, దాదాపు 75లక్షలమంది కరోనా బారినపడతారు. 50 నుంచి 60 మంది ఉపాధ్యాయులు ఇప్పటికే కరోనాతో చనిపోయారు'' అని జవహర్ ఆందోళన వ్యక్తం చేశాడు.
వీడియో
''విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ నిర్ణయాలకు విలువలేదు... తాడేపల్లి ఆదేశాలను అమలుచేయడమే ఆయన పని. జగన్మోహన్ రెడ్డి తన మూర్ఖత్వాన్ని పక్కనపెట్టి విద్యార్థుల ప్రాణాల గురించి ఆలోచించాలి'' అని జవహర్ సూచించారు.