తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చీకోటి ప్రవీణ్ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తనను, వల్లభనేని వంశీని ఇరికించాలని కొందరు కుట్ర చేస్తున్నారని నాని ఆరోపించారు.  

గుడివాడలో క్యాసినో జరగలేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani). గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చికోటీ ప్రవీణ్‌ను (chikoti praveen kumar) కొంతమంది బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన పేరు, వంశీ పేరు చెప్పాలని బెదిరిస్తున్నారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని.. తన లారీలు ఇసుక తరలిస్తున్నాయని పవన్ ఆరోపించారని నాని మండిపడ్డారు. తన లారీలు వున్నాయని నిరూపిస్తే.. గుడివాడ వదిలి వెళ్లిపోతానని కొడాలి నాని సవాల్ విసిరారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత నెలలో క్యాసినో వ్యవహారంలో టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దమ్ముంటే ఈడీతో తనను అరెస్ట్ చేయించాలని ఆయన సవాల్ విసిరారు. చికోటి వ్యవహారాన్ని తమపై ఆపాదించడం సరికాదన్నారు. క్యాసినోపై టీటీపీ నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఈడీకి ఇవ్వాలని నాని డిమాండ్ చేశారు. దేశంలో ఏం జరిగినా జగన్‌కు ముడిపెడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. 

ALso Read:సీఎం జగన్‌తో పరిచయం లేదు.. వారిపై చర్యలు తీసుకోండి: పోలీసులకు చీకోటీ ప్రవీణ్ ఫిర్యాదు

ఇకపోతే.. క్యాసినో వ్యవహారంలో హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటీ ప్రవీణ్‌ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుపై ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చీకోటి ప్రవీణ్.. ఆగస్ట్ 3న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ అకౌంట్లలో తన పేరును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించాడు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి పోస్టుల వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నానని చెప్పారు. 

ఏపీ సీఎంతో తనకు సంబంధాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారని.. అసలు ఆయనతో తనకు పరిచయమే లేదని చీకోటి ప్రవీణ్ చెప్పారు. దీని వెనుక ఏపీ ప్రతిపక్ష నాయకులు ఉన్నట్లుగా అనుమానంగా ఉందని ఆరోపించారు. ఫేక్ అకౌంట్లలో కించపరిచే విధంగా పోస్టులు పెట్టే వ్యక్తులను పట్టుకోవాలని ఫిర్యాదులో చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు. ఇదే విషయంపై ఏపీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టుగా చెప్పారు. ఇక, ఈ కేసులో చీకోటి ప్రవీణ్ నేడు మూడో రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.