ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పార్టీలో పరిణామాలు, అసంతృప్తికి గల కారణాలను జగన్‌కు బాలినేని వివరించినట్లుగా తెలుస్తోంది.

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం కలకలం రేపుతోంది. సమన్వయకర్త బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడంతో బాలినేనిని బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఆయన మెత్తబడకపోవడంతో సీఎం జగన్ మంగళవారం తాడేపల్లికి పిలిపించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య 40 నిమిషాల పాటు మంతనాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీలో పరిణామాలు, అసంతృప్తికి గల కారణాలను జగన్‌కు బాలినేని వివరించినట్లుగా తెలుస్తోంది. తన సొంత జిల్లాలో తన ప్రాధాన్యత తగ్గించే విధంగా ఎవరు పనిచేస్తున్నారనే అంశంలో కొందరిపై ముఖ్యమంత్రికి ఆయన ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అలాగే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారన్న అంశంపై బాలినేనిని జగన్ వివరణ అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్ బాధ్యతలను తిరిగి తీసుకునేలా ఒప్పించాలని జగన్ ప్రయత్నించారు. అయితే శ్రీనివాస్ రెడ్డి మెత్తబడలేడని సమాచారం. ఏం జరిగినా సరే సమన్వయకర్త బాధ్యతలు తీసుకునేది లేదని ఆయన సీఎంకు తేల్చిచెప్పినట్లుగా వైసీపీలో గుసగలు వినిపిస్తున్నాయి. జగన్‌తో భేటీ తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియా కంట పడకుండా మరో మార్గంలో వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. 

Also Read: జగన్ కు బిగ్ షాక్.. కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న బాలినేని..!

ఇదిలా ఉంటే.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బంధువనే సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక జగన్ తన మంత్రివర్గంలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో.. బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. స్వయంగా జగన్ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు. 

ఇక, ఇటీవల సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన నేపథ్యంలో మార్కాపురంలో హెలిప్యాడ్ వద్దకు వెళ్లడానికి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని సూచించారు. దీంతో పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కార్యక్రమం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే బాలినేని సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీలు ప్రయత్నించారు. అయితే బాలినేని అక్కడి నుంచి వెనుదిరిగేందుకే నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సీఎంవో నుంచి బాలినేనికి ఫోన్ కాల్ వెళ్లడంతో.. ఆయన తిరిగివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.