తెలుగుదేశం పార్టీ, జనసేనలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మరోసారి పాడె కడతామని ఆయన జోస్యం చెప్పారు. లోకేష్ కమెడియన్లా మాట్లాడుతున్నాడని అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.
గుంటూరులో జరుగుతోన్న వైసీపీ ప్లీనరీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (anil kumar yadav) టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం నేతలు నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రోషం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ అనిల్ కుమార్ యాదవ్ దుయ్యబట్టారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడి ఆటలు సాగవని మాజీ మంత్రి హెచ్చరించారు. బిడ్డా ఈ రాష్ట్రం వైసీపీ అడ్డా అంటూ అనిల్ కుమార్ అన్నారు. తాము సంస్కారంతో ఓపిగ్గా వున్నామని.. కానీ లోకేష్ కమెడియన్లా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. 2022 ఎన్నికల్లో టీడీపీకి మరోసారి పాడె కడతామని అనిల్ కుమార్ యాదవ్ జోస్యం చెప్పారు.
మరోవైపు తొలిరోజు వైసీపీ ప్లీనరీ ముగిసింది. ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానం చేశారు. మహిళా సాధికారత- దిశ చట్టం, విద్యా రంగంలో సంస్కరణలు, నవరత్నాలు - డీబీటీ, వైద్య ఆరోగ్య రంగంపై తీర్మానాలు చేశారు. రేపు ప్లీనరీలో మరో 5 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.
ALso REad:మా గెలుపు ఆపలేకే రాక్షస గణాలు ఏకం: వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో జగన్
అంతకుముందు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (chevireddy bhaskar reddy) మాట్లాడుతూ.. శుక్రవారం గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో (ysrcp plenary) ఆయన మాట్లాడుతూ.. ఓ వ్యక్తి కష్టం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మా బిడ్డ వున్నాడని గర్వంగా చెప్పుకునేలా జగన్ పాలన సాగిస్తున్నారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. పేద విద్యార్ధులను సొంత అన్నలా చదివిస్తున్న నాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. పిల్లలకు మంచి చదువులు చదివించాలన్న ఆలోచనలతో విద్యాదీవెన, అమ్మఒడి, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
అనంతరం మంత్రి విడదల రజనీ (vidadala rajini) మాట్లాడుతూ.. జగన్ ఎంతోమంది లీడర్లను తయారు చేశాడని అన్నారు. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా జగనన్న పాలన వుందని రజనీ ప్రశంసించారు. వైసీపీ ప్రస్థానం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీతో మొదలైందని ఆమె గుర్తుచేశారు. టీడీపీ పాలనలో కంటే ఎక్కువ మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్నామని రజనీ అన్నారు. జగనన్న పాలన ప్రజాహితం, పేదల పక్షమని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని మంత్రి వెల్లడించారు. పేదరికానికి వైద్యం అందిస్తున్న ఏకైక డాక్టర్ వైఎస్ జగన్ అని రజనీ అభివర్ణించారు. చంద్రబాబు ఆరోగ్య రంగానికి ఉరేస్తే.. జగన్ ఊపిరి పోశారని మంత్రి అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.. ఓడిపోయే టీడీపీకి మాటలు ఎక్కువంటూ రజనీ సెటైర్లు వేశారు.
