మంత్రిగా వుండటం కంటే జగన్ సైనికుడిగా వుండటమే ఇష్టమన్నారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో జరిగిన ఆత్మయ సభలో ఆయన ప్రసంగించారు. నెల్లూరు జిల్లాలో వర్గాలు వుండవని.. వున్నది జగన్ వర్గం ఒక్కటేనన్నారు.
నెల్లూరు జిల్లాలో వర్గాలు వుండవని.. వున్నది జగన్ (ys jagan) వర్గం ఒక్కటేనని మాజీ మంత్రి అనిల్ కుమార్ (anil kumar yadav) పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరులో (nellore) జరిగిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ.. తనతో పాటు ఏ నాయకుడైనా జగన్ బొమ్మతోనే గెలుస్తారని అనిల్ వ్యాఖ్యానించారు. తాను తలపెట్టిన చిన్న చిన్న పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేస్తానని అనిల్ కుమార్ హామీ ఇచ్చారు. వాళ్లిద్దరూ కట్టకట్టుకుని వచ్చినా.. సింగిల్గా వచ్చినా జగనే సీఎం అంటూ పరోక్షంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై సెటైర్లు వేశారు. తాను ఎవరికీ పోటీ కాదని.. తనకు తానే పోటీన అని ఆయన అన్నారు. ఎవరికీ బలనిరూపణ చేయాల్సిన అవసరం లేదని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. 2024లో మళ్లీ గెలుస్తామని.. మంత్రులుగా వస్తామని ఆయన జోస్యం చెప్పారు.
సీఎం వైఎస్ జగన్ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనన్నారు. జగన్ వెంట ఓ సైనికుడిలా నడుస్తానని స్పష్టం చేశారు. జగన్ వెంట కసితో ప్రయాణం చేశానని అనిల్ కుమార్ అన్నారు. జగన్ను అభిమానించే ప్రతి గుండె తనను రెండుసార్లు గెలిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇచ్చినప్పుడే రెండున్నరేళ్లు వుంటుందని జగన్ ముందే చెప్పారని అనిల్ కుమార్ గుర్తుచేశారు.
ఇప్పుడు మళ్లీ నిత్యం ప్రజల్లో వుండే అవకాశాన్ని జగన్ కల్పించారని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి 2024లో మళ్లీ జగన్ను గెలిపిస్తామని అనిల్ స్పష్టం చేశారు. మంత్రిగా వుండటం కంటే జగన్ సైనికుడిగా వుండటమే ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఎన్నికల్లో వైసీపీకి ఘనమైన విజయం అందించారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తన వెంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి దఫాలోనే మంత్రిని అవుతానని అనుకోలేదని అనిల్ పేర్కొన్నారు.
