గంజి ప్రసాద్ హత్యకు గ్రామంలో ఆధిపత్యపోరే కారణమని వెల్లడించారు ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఎంపీటీసీ బజారయ్య ఓకే అన్న తర్వాతే సురేష్ కత్తులు తీసుకొచ్చాడని.. ఆపై గ్రామంలో మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించారని ఆయన తెలిపారు.
గంజి ప్రసాద్ హత్యకు మూడు రోజులు రెక్కీ నిర్వహించారని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ శర్మ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై మీద చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్రామంలో జరిగిన గొడవలు, ఘర్షణలకు సంబంధించి ఎస్సై చర్యలు తీసుకోలేదని ఎస్పీ తెలిపారు. దీనిలో భాగంగానే ఎస్సైని సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు. గ్రామంలో ఆధిపత్యపోరే హత్యకు కారణమని ఎస్పీ వెల్లడించారు. ఎంపీటీసీ బజారయ్య ఓకే అన్న తర్వాతే సురేష్ కత్తులు తీసుకొచ్చాడని రాహుల్ దేవ్ అన్నారు. గంజి ప్రసాద్ హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. వీరందరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని.. అనంతరం జైలుకు పంపుతామని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే.. YCP నేత గంజి ప్రసాద్ హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎంపీటీసీ సభ్యుడు Bazaraiah ఆదివారం నాడు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సంగతి తెలిసిందే. శనివారం నాడు ద్వారకా తిరుమలలోని జి. కొత్తపల్లి వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఏ1 గా బజారయ్య ఉన్నాడు. Ganji Prasad గతంలో TDP లో ఉండేవాడు. 2019 ఎన్నికల సమయంలో ఆయన టీడీపీని వదిలి వైసీపీలో చేరాడు. టీడీపీలో ఉన్న సమయంలో ప్రస్తుత హోంమంత్రి Taneti Vanitha అనుచరుడిగా ఉన్నాడు. తానేటి వనిత గతంలో గోపాలపురం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె వైసీపీలో చేరారు. కానీ గంజి ప్రసాద్ టీడీపీలోనే కొనసాగారు. అయితే గత ఎన్నికల సమయంలో ప్రసాద్ వైసీపీలో చేరారు.
గంజి ప్రసాద్ వైసీపీలో చేరిన తర్వాత వైసీపీలో బజారయ్యకు, గంజి ప్రసాద్ కు మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. శనివారం నాడు జి.కొత్తపల్లికి సమీపంలోనే గంజి ప్రసాద్ ను ప్రత్యర్ధులు బైక్ పై వచ్చి హత్య చేశారు. ఈ విషయం తెలిసి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై కూడా గ్రామస్తులు దాడి చేశారు. గంజి ప్రసాద్ హత్య కేసులో ఎంపీటీసీ సభ్యుడు బజారయ్య హస్తం ఉందని పోలీసులకు కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. హత్య అనంతరం గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను ఏపీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గంజి ప్రసాద్ కుటుంబాన్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఆదుకొంటామని తానేటి వనిత పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
