ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఎన్నికల ఏర్పాట్లగురించి చర్చించేందుకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనుంది.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వివిధ నియోజకవర్గాల్లో ఇంచార్జీల నియామకం, పార్టీ సమావేశాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా వుండాలనే వైఎస్ జగన్ వ్యాఖ్యలు ముందస్తు ఊహాగానాలకు కారణమయ్యాయి. అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఏపీ అసెంబ్లీ గడువు 2024 జూన్ 16 తో ముగుస్తుందని ఈసిఐ కీలక ప్రకటన చేసింది. దీంతో ఇక ఏపీలో ముందస్తు ఎన్నికలు వుండవనే క్లారిటీ వచ్చింది.
2024లో లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ లో అధికారుల బదిలీకి ఈసి ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలీస్ శాఖకు కూడా బదిలీ నిబంధనలు వర్తిస్తాయని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఇదిలావుంటే ఇవాళ్టి నుండి రెండు రోజులపాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఏపీలో పర్యటించనుంది. డిప్యూటీ ఎన్నికల కమీషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ లతో కూడిన ఏడుగురు సభ్యుల బృందం ఇవాళ(శుక్రవారం) ఏపీకి రానున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి లతో పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం సమావేశమై 2024 లో జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతపై చర్చించనున్నారు.
Also Read పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్లో 2014 రిజల్ట్స్ వస్తాయా?
రెండు రోజులపాటు విజయవాడ నోవాటెల్ హోటల్లో ఈసీ బృందం సమీక్షా సమావేశాలు చేపట్టనుంది. ఇందుకోసం అధికారులు అన్నిఏర్పాట్లు చేసారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు పరిశీలించారు. సీఎస్, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసి బృందం సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనుంది.
