మాజీ ఎంపీ, ప్రతిపక్ష తెలుగుదేశం నాయకుడు రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఇవాళ తెల్లవారుజామునుండి ఈడీ సోదాలు చేపట్టింది.
గుంటూరు : తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 10 మంది ఈడి అధికారులు బృందం రాయపాటి ఇంటికి చేరుకుని సోదాలు ప్రారంభించింది. రాయపాటికి సంబంధించిన ట్రాన్స్ ట్రాయ్ కంపనీ బ్యాంక్ రుణాల ఎగవేతపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతోంది ఈడి. ఈ క్రమంలోనే రాయపాటి ఇంట్లో ఈడి అధికారులు సోదాలు చేపట్టారు.
వీడియో
బ్యాంకు రుణాలను కట్టకుండా ఎగవేయడానికి ప్రయత్నిస్తోందంటూ ట్రాన్స్ ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపనీపై మనీ లాండరింగ్ కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా గతంలో సిబిఐ అధికారులు, ఇప్పుడు ఈడి అధికారులు రాయపాటి ఇంట్లో సోదాలు నిర్వహించారు. గుంటూరుతో పాటు తొమ్మిది చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ రాయపాటితో పాటు ట్రాన్స్ ట్రాయ్ ప్రమోటర్ల కార్యాలయాలు, నివాసాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
ట్రాన్స్ ట్రాయ్ బ్యాంకు రుణాలు ఎగవేత కేసులో 2019 డిసెంబర్ లోనే రాయపాటి సాంబశివరావు ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు దాడులు చేసారు. ఆ సమయంలో హైద్రాబాద్, బెంగుళూరు, గుంటూరులలోని కార్యాలయాలు, ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రాన్స్ ట్రాయ్ ఎండీ శ్రీధర్ తో పాటు ఇంకా పలువురి ఇళ్లలో కూడ సోదాలు నిర్వహించారు.
Read More తెనాలిలో గంజాయి బ్యాచ్ వీరంగం... రాడ్లు, రాళ్లు, బ్యాట్లతో నలుగురిపై దాడి (వీడియో)
ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పలు బ్యాంకుల నుండి రూ. 10,400 కోట్లు రుణాలు తీసుకుని ఎగవేసిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇలా యూనియన్ బ్యాంకు నుండి రూ.300 కోట్లు తీసుకుని ఎగవేయడానికి ట్రాన్స్ ట్రాయ్ ప్రయత్నిస్తోందట. ఈ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
అయితే భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం కావడంతో ఈడీ కూడాడ రంగంలోకి దిగింది. ఇవాళ తెల్లవారుజామునే ఈడీ అధికారులు ట్రాన్స్ ట్రాయ్ తో సంబంధాలున్నవారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
